Rahul Gandhi | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారత ఎన్నికల సంఘం అడ్వైజరీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో బహిరంగ సభల్లో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల సంఘం సూచించింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు.. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ ఈ సూచన చేసింది. గతేడాది నవంబర్లో రాహుల్ గాంధీ ప్రధానిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రచారంలో రాజకీయ నేతల ప్రసంగాలు హద్దుమీరుతున్న నేపథ్యంలో సంయమనం పాటించాలంటూ కోరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ‘పనౌటీ’ అనే పదాన్ని రాహుల్ గాంధీ ఉపయోగించారు. గతేడాది ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.
జట్టు ఓటమిపై రాహుల్ స్పందించారు. మంగళవారం ప్రపంచకప్లో ఓడిపోవడానికి మోదీనే అంటూ పరోక్షంగా కారణమని వ్యాఖ్యానించారు. ‘మన అబ్బాయిలు దాదాపు ప్రపంచకప్ గెలుచుకున్నారు. ఓ చెడు శకునం (పనౌటి) ప్రవేశం వారిని ఓడిపోయేలా చేసింది’ అంటూ మోదీని ఉద్దేశిస్తూ పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, అమిత్షా, అదానీలను జేబుదొంగలతో పోల్చారు.