న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: శివసేన పార్టీ చీలిక వ్యవహారం కీలక మలుపు తిరిగింది. శివసేన పేరు, ఆ పార్టీ గుర్తైన విల్లు బాణాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తున్నట్టు శుక్రవారం ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మెజారిటీ, పార్టీ రాజ్యాంగం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది. ఎమ్మెల్యేల్లో షిండే వెంట 76 శాతం, ఉద్ధవ్ వెంట 23.5 శాతం మంది ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఉప ఎన్నికలు ముగిసే వరకు ఉద్ధవ్ ఠాక్రే వర్గం ‘శివసేన(ఉద్ధవ్ బాలాసాహేబ్ ఠాక్రే)’ పేరును, కాగడా గుర్తును వాడుకునేందుకు ఈసీ అనుమతించింది.
మొదటిసారి ఠాక్రేల చేజారిన శివసేన
భూమిపుత్రులకు న్యాయం చేయడమే లక్ష్యంగా 1966లో బాల్ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఠాక్రే కుటుంబం సారథ్యంలోనే శివసేన నడిచింది. మొదటిసారిగా ఇప్పుడు వారి చేతుల్లో నుంచి పార్టీ చేజారిపోయింది. శివసేనలో తిరుగుబావుటా ఎగురవేసి షిండే వర్గం విడిపోయిన తర్వాత.. తమదంటే తమదే అసలైన శివసేన అని రెండు వర్గాలూ వాదిస్తున్నాయి. ఈ వ్యవహారంపై షిండే ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. దీంతో ఉద్ధవ్ వర్గానికి ‘శివసేన(ఉద్ధవ్ బాలాసాహేబ్ ఠాక్రే)’ పేరును, కాగడా గుర్తును, షిండే వర్గానికి ‘బాలాసాహేబంచి శివసేన’ పేరును, రెండు కత్తుల గుర్తును తాత్కాలికంగా కేటాయిస్తూ గత అక్టోబరులో ఈసీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
నిరాశ చెందబోం.. పోరాడుతాం: ఉద్ధవ్
షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయించడం ప్రజాస్వామ్యాన్ని హతమార్చినట్టేనని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ఎర్రకోట నుంచి ప్రధాని ఈ విషయం ప్రకటించాలన్నారు. అసలైన విల్లు, బాణం తమ వద్దే ఉన్నాయని, షిండే వర్గం చేతిలో ఇవి పేపర్పై మాత్రమే ఉన్నాయన్నారు. శివసేన గుర్తును షిండే వర్గం దొంగలించిందని ఆరోపించారు. తాము నిరాశ చెందబోమని, పోరాడుతామని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈసీ నిర్ణయాన్ని ప్రజలు, నిజం సాధించిన విజయంగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అభివర్ణించారు. బాల్ ఠాక్రే ఆశీస్సులతోనే ఇది సాధ్యమైందన్నారు.