Election code : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా డీకే శివకుమార్ కోడ్ను ఉల్లంఘించారంటూ బెంగళూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ‘ఓటుకు నీళ్లు’ ఆఫర్ చేసి శివకుమార్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని పేర్కొన్నారు.
డీకే శివకుమార్ శనివారం తన సోదరుడు డీకే సురేష్ తరఫున బెంగళూరులో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డీకే సురేష్ బెంగళూరు రూరల్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రచారం సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. తన సోదరుడు సురేష్ను గెలిపిస్తే కావేరీ నది నుంచి తాగునీటిని తీసుకొచ్చి నగర ప్రజల దాహార్తి తీరుస్తానని హామీ ఇచ్చారు.
డీకే శివకుమార్ ఓటర్లకు ఇచ్చిన ఈ హామీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓటు వేస్తే నీళ్లు ఇస్తామని చెప్పడం ఓటర్లను ప్రలోభపెట్టడమేనని విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
కాగా, గడిచిన రెండు నెలలుగా బెంగళూరులో తాగు నీటికి కొరత ఏర్పడింది. నగర ప్రజలకు రోజుకు 2,600 నుంచి 2,800 మిలియన్ లీటర్ల తాగు నీటి అవసరం ఉండగా.. ప్రస్తుతం అందులో సగం మాత్రమే లభ్యత ఉంది. దాంతో బెంగళూరు వాసులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు.