Kerala High Court | కొచ్చి, ఫిబ్రవరి 9: పార్టీ ఫిరాయింపుదార్లకు అడ్డుకట్ట వేస్తూ కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి ఫిరాయించేవారు మళ్లీ ప్రజాతీర్పును కోరాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు ఓటర్ల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదని పేర్కొంది. ఓ రాజకీయ పార్టీ లేదా రాజకీయ కూటమి నుండి ఎన్నికైన అభ్యర్థి ఆ పార్టీ లేదా కూటమికి వ్యతిరేకంగా తన వైఖరిని మార్చుకోకూడదని స్పష్టం చేసింది. తన పార్టీకి విరుద్ధంగా వ్యవహరించాలనుకుంటే ఆ అభ్యర్థి మరోసారి ప్రజాతీర్పును కోరాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇడుక్కి జిల్లాలోని ఆదిమాలి గ్రామ పంచాయతీకి చెందిన పార్టీ ఫిరాయింపు కేసులో జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఈ నెల 5న ఈ తీర్పును వెలువరించారు.
ఓ ప్రజాప్రతినిధి తన నియోజకవర్గ ప్రజల గొంతుకగా ఉండాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆ ప్రజాప్రతినిధి ఓటర్ల అభీష్టానికి వ్యతిరేకంగా, తన ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని అన్నారు. ‘ఓ రాజకీయ పార్టీ లేదా కూటమి నుంచి ఎన్నికైన ప్రతినిధి తన పదవీకాలం పూర్తయ్యేవరకు ఆ పార్టీని లేదా కూటమిని విడిచిపెట్టకూడదు. ఓ రాజకీయ పార్టీ అభ్యర్థిగా ఉన్నందునే వారిని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి.. ఆ అభ్యర్థి తన ఇష్టానుసారంగా వ్యవహరించకూడదు’ అని వ్యాఖ్యానించారు. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్రంగా ఎన్నికైతే.. ఆ అభ్యర్థి ప్రజల అభీష్టం ప్రకారం నడుచుకోవాలని పేర్కొన్నారు. ఓ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన వారు ఆయా మండళ్లు లేదా సంస్థలు, సభల్లో తమను ఎన్నుకున్న ప్రజల ఉద్దేశాలను వెల్లడించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆంగ్ల క్యాథలిక్ చరిత్రకారుడు, రాజకీయవేత్త, రచయిత లార్డ్ యాక్టన్ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ.. ‘అధికారం అవినీతికి పాల్పడేలా చేస్తుంది.. సంపూర్ణ అధికారం అవినీతిలో పూర్తిగా ముంచేస్తుంది’ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ మాటలను గుర్తుంచుకోవాలని చెప్పారు. ఎన్నికైన సభ్యుడు మరోసారి ఓటర్ల తీర్పు కోరేంత వరకు తనను ఎన్నుకున్న ప్రజల అభీష్టాన్ని వ్యక్తపరచాలన్నది ఫిరాయింపుల నిరోధక చట్టం ఉద్దేశమని గుర్తు చేశారు.