జైపూర్: ఒక వృద్ధురాలి ఇంట్లో చోరీ జరిగింది. (Elderly Woman’s House Robbed ) అరవకుండా ఆమె నోట్లో గుడ్డలు కుక్కారు. డబ్బు, బంగారం, నగలు దోచుకున్నారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వృద్ధురాలి మనవడు తన స్నేహితులతో కలిసి ఈ చోరీ కోసం కుట్ర పన్నినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భీమ్గంజ్ ప్రాంతంలో నివసిస్తున్న బాను మన్సూరి ఇంట్లోకి బుధవారం నలుగురు వ్యక్తులు ప్రవేశించారు. ఆ వృద్ధురాలు కేకలు వేయకుండా ఆమె నోట్లో గుడ్డలు కుక్కారు. అనంతరం ఆమె ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, ఈ చోరీ గురించి ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఈ దొంగతనానికి సంబంధించి మహ్మద్ అఫ్తాబ్, సూరజ్ సాల్వి, ఆదిల్ ఖాన్, మహ్మద్ రియాజ్ అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వృద్ధురాలి ఇంట్లో చోరీకి ఆమె మనవడు మహ్మద్ అఫ్తాబ్ తన స్నేహితులతో కలిసి ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.