భువనేశ్వర్: ఆమె ఓ వృద్ధురాలు. యాచకురాలిగా జీవనం సాగిస్తున్నది. వచ్చిన పైసల్లో తన ఖర్చులు పోగా నాలుగు ఆవులను పోషిస్తున్నది. ఓ రోజు మున్సిపల్ అధికారులు వాటిని గో శాలకు తరలించారు. దీంతో తన ఆవులను ఇప్పించాలని జిల్లా ప్రథమ పౌరుడిని వేడుకున్న ఘటన ఒడిశాలోని సోనేపూర్లో జరిగింది.
తరాష్ బాగ్ అనే వృద్ధురాలు యాచకురాలిగా జీవనం సాగిస్తున్నది. ఆమెకు ఉండటానికి ఇళ్లు లేకపోవడంతో సోనేపూర్ జిల్లా దవాఖాన ఆవరణలో తలదాచుకుంటున్నది. రోజూ యాచనతో వచ్చిన డబ్బులో తన ఖర్చులుపోగా మిగిలిన పైకంతో నాలుగు ఆవుల ఆలనా పాలన చూస్తున్నది. అయితే అవి రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుండటంతో మున్సిపల్ అధికారులు వాటిని గోశాలకు తరలించారు.
దీంతో ఆవుల కోసం మున్సిపల్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా లాభం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తానుంటున్న దవాఖాన పక్కనే ఉన్న జిల్లా కలెక్టరేట్కు వెళ్లింది. విధుల్లో భాగాంగా బయటకు వెళ్తున్న జిల్లా కలెక్టర్ సునీల్ నరవణే కారుముందు పడుకుంది. తన ఆవులను ఇప్పించాలని అర్ధించింది. వాటిని తిరిగి ఇప్పిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
పోట్టకూటి కోసం యాచననే వృత్తిగా ఎంచుకున్న ఆమె.. మూగ జీవాలపై పెంచుకున్న అభిమానానికి ఇది నిదర్శనంగా నిలిచింది.