గోద్రా: 2002 నాటి గోద్రా రైలు దహనం కేసులో దోషులుగా ఉన్న 8 మందికి సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. వాళ్లు జైలు జీవితం గడిపిన సమయం, నేరంలో వారి పాత్ర తీవ్రతలను పరిగణలోకి తీసుకుని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆ ఎనిమిది మందికి బెయిల్ ఇచ్చింది. అయితే ఇదే కేసులో దోషులుగా ఉన్న మరో నలుగురికి బెయిల్ ఇచ్చేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది. నేరంలో వారి పాత్ర తీవ్రత ఎక్కువగా ఉన్నందున బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది.
కాగా, 2002 ఫిబ్రవరి 27న గుజరాత్లోని గోద్రా రైల్వే స్టేషన్లో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలులోని ఎస్-6 కోచ్కు దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఆ కోచ్లో ఉన్న 59 మంది కర సేవకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా మత ఘర్షణలకు దారితీసింది. ఇదిలావుంటే గుజరాత్లో అల్లర్లకు సంబంధించిన నరోడా గామ్ (Naroda Gam) ఊచకోత కేసులో అహ్మదాబాద్లోని స్పెషల్ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది.
గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ నేత మాయా కొద్నానీ (Maya Kodnani), వీహెచ్పీ మాజీ నేత జయ్దీప్ పటేల్, బజరంగ్దళ్కు చెందిన బాబు బజరంగీ సహా 67 మందిని నిర్దోషులుగా తేలుస్తూ తీర్పుచెప్పింది. సిట్ కేసులకు సంబంధించి ప్రత్యేక న్యాయమూర్తి ఎస్కే బక్సీ ఈ తీర్పు వెల్లడించారు. నరోడా గామ్ ఊచకోతకు సంబంధించి మొత్తం 86 మందిపై కేసులు నమోదయ్యాయి. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే 18 మంది ప్రాణాలు కోల్పోగా, ఒకరు ఇదివరకే విడుదలై వెళ్లిపోయారు.