లక్నో, జూన్ 19: ఇండియా మౌగ్లీ గర్ల్గా పేరు తెచ్చుకున్న ఎహసాస్ (18) కన్నుమూసింది. 2017లో కటార్నియా ఘాట్ ఫారెస్ట్ ఏరియాలో రోడ్డు పక్కన ఆమె మొదటిసారి కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకుంటే ఆ సమయానికి ఆమె మానవులతో సంబంధం లేకుండా జీవిస్తున్నది. రెండు చేతులు, రెండు కాళ్లపై నడిచేది. బట్టలు వేసుకోడానికి ఇష్టపడేది కాదు. మనుషులతో దూకుడుగా ప్రవర్తించేది. దాంతో ఆమెను ది జంగిల్ బుక్లోని మౌగ్లీ గర్ల్తో పోల్చారు. అప్పటి నుంచే ఆమె మౌగ్లీ గర్ల్గా ఫేమస్ అయింది. ఆమెను మొదట శిశుసంక్షేమ శాఖ అధికారులు తీసుకెళ్లి పూజ అని పేరు పెట్టారు.
ఆ తర్వాత నిర్వాన్ గవర్నమెంట్ స్కూల్లో చేర్చాక ఆమె పేరును ఎహసాస్గా మార్చారు. అయితే కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నది. రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్లో చికిత్స చేయగా.. ఆమెకు తీవ్రమైన బ్లడ్ ఇన్ఫెక్షన్తో పాటు ఊపిరితిత్తుల వ్యాధి సోకినట్టు గుర్తించారు. ఇటీవల అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో తిరిగి హాస్పిటల్లో చేర్పించగా.. జూన్ 15న చనిపోయిందని అధికారులు తెలిపారు.