న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపు దాలుస్తున్నది. ఉక్రెయిన్పై సైనిక చర్య ప్రారంభమై ఎనిమిది రోజులకు చేరింది. యుద్ధం ప్రభావం ముడిచమురుపై పడుతున్నది. దీంతో గురువారం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర దశాబ్దంలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. ప్రస్తుతం ధర బ్యారెల్కు 117 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్ కూడాయిల్ పైపైకి వెళ్తుండడంతో దేశంలో ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఇదిలా ఉండగా.. రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని పెంచకూడదని నిర్ణయించాయి. ఇది కూడా ముడి చమురు రేటు పెరగడానికి ఇదో కారణం. బ్రెంట్ క్రూడ్ ధర గురువారం 117 డాలర్లకు పెరగ్గా.. మరో వైపు డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ ధర బ్యారెల్కు 2.67శాతం పెరిగి 113.6 డాలర్లకు చేరింది. బ్రెంట్ క్రూడ్ ధర గరిష్ఠంగా పెరగడం 2011 తర్వాత ఇదే తొలిసారి.
ఈ ఏడాది ప్రారంభంలోనే ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. గురువారం పదేళ్ల రికార్డును బద్దలు కొడుతూ గరిష్ఠ స్థాయికి చేరింది. బ్రెంట్ క్రూడ్ ధర 2014 తర్వాత తొలిసారిగా బ్యారెల్కు 100 డాలర్లు దాటింది. గత నాలుగు నెలలుగా క్రమంగా పెరుగుతూ వస్తున్నది. బ్రెంట్ క్రూడ్ ధర డిసెంబర్లో 10.22శాతం, జనవరిలో 17శాతం, ఫిబ్రవరిలో 10.7శాతం, మార్చిలో ఇప్పటి వరకు 16శాతానికిపైగా పెరిగింది.
ముడి చమురు ధరల పెరుగుదల భారీగా ప్రభావం చూపనున్నది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే దేశంలో రికార్డు స్థాయికి ఇంధన ధరలు చేరగా.. గత నాలుగు నెలల కింద కేంద్రం సుంకం తగ్గించింది. అప్పటి నుంచి ఇప్పటి ధరలు స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ముడి చమురు ధరలు పెరుగుతున్నా ఇప్పటి వరకు కంపెనీలు ధరలు పెంచలేదు.
అయితే, ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలే కారణమని తెలుస్తున్నది. ఈ నెల 7న జరిగే పోలింగ్ అనంతరం, లేదంటే 10న ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్పై గరిష్ఠంగా రూ.9 వరకు పెంచే అవకాశం ఉంది. ఒకేసారి ధరలు పెంచలేమని, కొద్ది రోజుల్లో కొద్ది కొద్దిగా పెంచే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.