న్యూఢిల్లీ: లాభాలు పొందేందుకు విద్య వ్యాపారం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఫీజులు అందరికీ అందుబాటులో ఉండాలని స్పష్టంచేసింది. వైద్యకళాశాలల్లో ట్యూషన్ ఫీజును ఏడాదికి రూ.24 లక్షలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే పిటిషన్ వేసిన నారాయణ వైద్య కళాశాల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.5 లక్షల జరిమానా విధించింది. కోర్టు రిజిస్ట్రీ వద్ద ఆరు వారాల్లోగా దీనిని జమ చేయాలని ఆదేశించింది.