చెన్నై : పది మంది డీఎంకే ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఈకే పళనిస్వామి (ఈపీఎస్) పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు డీఎంకేలో చేరతారనే వార్తల గురించి ప్రస్తావించగా అలాంటిదేమీ లేదని, పది మంది డీఎంకే ఎమ్మెల్యేలే తన వర్గంతో టచ్లో ఉన్నారని ఆయన అన్నారు.
డీఎంకే కుటుంబ పార్టీ, కార్పొరేట్ పార్టీ అని ఈపీఎస్ ఆరోపించారు. ఆ పార్టీలో గౌరవం ఆశించకూడదని అది ఓ కార్పొరేట్ కంపెనీ అని వ్యాఖ్యానించారు. ఉదయనిధి స్టాలిన్ కేవలం ఓ ఎమ్మెల్యే అని ఆయనకు ఎలాంటి పదవి లేకపోయినా నగర మేయర్ను పక్కనపెట్టి ఓ పధకాన్ని ప్రారంభించారని అన్నారు. శశికళ, టీటీవీ దినకరన్లు పార్టీలో చేరాలని పార్టీ శ్రేణులు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.
ఏఐఏడీఎంకే విస్తృతస్ధాయి సమావేశంలో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపధ్యంలో సీబీసీఐడీ అధికారులు ఆ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కోర్టు ఆదేశాలతోనే దర్యాప్తు చేపట్టారని రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి నిర్లక్ష్యంగా తయారైందని ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఈపీఎస్ పేర్కొన్నారు.