చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన (ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర ఖజగమ్) ఏఐఏడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాంతో ఇక నుంచి ఆయన తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకుగాను ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 160 స్థానాల్లో విజయం సాధించింది. గత పదేండ్లుగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఈ ఎన్నికల్లో కేవలం 72 స్థానాలకు పరిమితమైంది. దాంతో ఇన్నాళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన స్టాలిన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగా, గత నాలుగున్నరేండ్ల నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసిన పళనిస్వామి ఇప్పుడు ప్రతిపక్ష నేత అయ్యారు.