కోల్కతా, జనవరి 5: పశ్చిమబెంగాల్లో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులపై దాడి జరిగింది. ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్ఖాలిలోని టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంట్లో సోదాలకు వచ్చిన అధికారులు, వారికి భద్రతగా వచ్చిన సీఆర్పీఎఫ్ సిబ్బందిపై వందలాది మంది గుంపు దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లు, ఇటుకలతో దాడి చేశారని, ముగ్గురు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయని ఈడీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. దాడి ఘటనపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపింది. దాడికి పాల్పడిన వారంతా షాజహాన్ అనుచరులు, మద్దతుదారులుగా అనుమానిస్తున్నట్టు ఈడీ తన ఫిర్యాదులో పేర్కొన్నది.
షాజహాన్ ఇంటికి సోదాలకు వెళ్లిన సమయంలో దాదాపు 800-1000 మంది మూక దాడికి వచ్చారని, అధికారులు, భద్రతా సిబ్బందిని ఘెరావ్ చేశారని ఈడీ పేర్కొన్నది. ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, పర్సులు వంటివి కూడా దోచుకెళ్లారని, దాడిలో పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు. గాయాలైన అధికారులు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. రేషన్ పంపిణీ స్కామ్ కేసులో అరెస్టైన మంత్రి జ్యోతిప్రియో మల్లిక్కు షాజ్హాన్ సన్నిహితుడనే పేరున్నది. కాగా, ఈడీ అధికారులపై దాడి ఘటనపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ కేంద్ర హోంమంత్రి అమిత్షాకు లేఖ రాశారు. టీఎంసీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు.
దాడి ఘటనపై వస్తున్న విమర్శలను అధికార టీఎంసీ ఖండించింది. ఈడీ అధికారులు స్థానికులను రెచ్చగొట్టడంతోనే దాడికి దారితీసిందని మంత్రి శశి పంజా ఆరోపించారు. కాగా, దాడి ఘటనకు సంబంధించి 10 మందిని అదుపులోకి తీసుకొన్నట్టు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
దాడి ఘటనను రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఖండించారు. తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. బెంగాల్ సొంత రాజ్యం కాదని పేర్కొన్న ఆయన.. మూర్ఖుల రాజ్యంలోనే ఆటవిక పాలన సాగుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో అనాగరికత, విధ్వంసాన్ని నియంత్రించాల్సిన బాధ్యత పౌర ప్రభుత్వంపై ఉంటుందన్నారు. ఈడీ అధికారులు సోదాలకు వెళ్లిన సందేశ్ఖాలిలో శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ కండ్లు తెరిచి వాస్తవాన్ని చూసి, తగిన చర్యలు తీసుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.