Kejriwal-ED | మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నుంచి ఆదేశాలు జారీ కావడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 21న అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ను ఈ నెల 28 వరకూ పీఎంఏల్ఏ కోర్టు ఈడీ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజా సంక్షేమ పథకాలు, తాగునీరు సంబంధ అంశాలపై అధికారులకు సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారని ఢిల్లీ మంత్రి అతిషి చేసిన ప్రకటనను నేరంగా పరిగణిస్తున్నట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆదేశాలు జారీ చేశారా? అన్న అంశంపై ఈడీ దర్యాప్తు చేపట్టనున్నదని అధికార వర్గాల కథనం.
అరవింద్ కేజ్రీవాల్కు ఈ నెల 28 వరకూ ఈడీ కస్టడీ విధించినా, ప్రతి రోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఒక అర్థగంట ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్, మరో అర్థగంట సేపు ఆయన తరఫు న్యాయవాదులతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. ఇదిలా ఉంటే, ఆదివారం ఉదయం ఢిల్లీ నీటి వనరుల మంత్రి అతిషి మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్.. తాగునీరు, పారిశుద్ధ్య సంబంధ సేవలు అందించేందుకు అధికారులకు డాక్యుమెంట్ పంపారని తెలిపారు. వేసవి కాలం నేపథ్యంలో నీటి కొరత ఉన్న ప్రాంతాలకు సరిపడా నీటి ట్యాంకుల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారని అతిషి తెలిపారు.
ఢిల్లీ ప్రజలకు తాగునీటి వసతులు కల్పించాలని చీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులకు కేజ్రీవాల్ సూచనలు చేశారని కూడా అతిషి తెలిపారు. ఈ సమావేశాలపై అవసరమైతే దర్యాప్తు చేస్తామని ఈడీ వర్గాలు తెలిపాయి. ఏదైనా ఉల్లంఘనలు జరిగితే తప్పనిసరిగా న్యాయస్థానం దృష్టికి తెస్తామని కూడా ఆ వర్గాలు పేర్కొన్నాయి. సెంట్రల్ ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అరవింద్ కేజ్రీవాల్ను ఆయన లాయర్లు, కుటుంబ సభ్యులు కలుసుకుంటారని, దీన్ని సీసీటీవీ వీడియో లింక్ ద్వారా ఈడీ అధికారులు పర్యవేక్షిస్తారని ఆ వర్గాల కథనం. సీఎం అనుచరులు, సిబ్బంది ఫోన్లను వాడి ఉంటారా? అన్న అంశంపైనా దర్యాప్తు చేస్తారని సమాచారం.