న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ(Enforcement Directorate) విచారణను ఎదుర్కొనేందుకు సీఎం కేజ్రీవాల్ సిద్దంగా ఉన్నారని ఆయన తరపు లాయర్ రమేశ్ గుప్తా తెలిపారు. కస్టడీలో ఉండేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీ కోర్టులో చెప్పారని, దర్యాప్తులో పూర్తిగా సహకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ను మరో ఏడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ కోరింది. సీఎం చట్టానికి అతీతుడు కాదు అని ఈడీ విచారణ సమయంలో పేర్కొన్నది. లిక్కర్ స్కామ్లో కస్టడీ పొడిగింపుపై కోర్టు తన తీర్పును రిజర్వ్లో ఉంచింది.
గోవా ఎన్నికల్లో పోరాడేందుకు సౌత్ గ్రూపు సుమారు వంద కోట్ల సొమ్మును ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా చేసినట్లు ఈడీ తన ఫిర్యాదులో ఆరోపించింది. ఒకవేళ వంద కోట్ల స్కామ్ జరిగితే, అప్పుడు ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈడీకి రెండే లక్ష్యాలు ఉన్నాయని, ఆప్ను నాశనం చేయడం, బెదిరింపు రాకెట్ను నడపడమే దాని ఉద్దేశం అన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు కేజ్రీకి ఈడీ కస్టడీ పొడిగించారు. ఒక మొబైల్ డేటాను రికవరీ చేసినట్లు ఈడీ చెప్పింది. మరో నాలుగు పరికరాల్లో ఉన్న డేటాను రికవరీ చేయాల్సి ఉన్నట్లు ఈడీ తెలిపింది.