న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ అధికారులు మంగళవారం సోదాలు జరిపారు. గత ఏడాది ఓ కేసులో అరెస్టు అయిన అమనతుల్లాకు ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులోనే మనీల్యాండరింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ తాజాగా సోదాలు జరిపింది. ఆప్ ఎంపీ రాఘవ చద్దా స్పందిస్తూ ఈడీ కేసుల్లో 95 శాతం కేసులు ప్రతిపక్ష నేతలపై నమోదు చేసినవేనని, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇలాంటి దాడులు చేపడుతున్న ఈడీ, సీబీఐలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో మాత్రం సైలెంట్గా ఉంటున్నాయని మండిపడ్డారు.
బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నం
ఆప్ నేతలు లక్ష్యంగా ఈడీ, సీబీఐ సోదాలు జరుపడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని డీడీయూ మార్గ్లో ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. అమనతుల్లా ఖాన్ ఇంట్లో సోదాలు జరిగిన గంటల వ్యవధిలోనే ఈ ఆందోళన జరిగింది. బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించడానికి వెళ్తున్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.