ముంబై: మహారాష్ట్ర రాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణం కేసులో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మనవడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ యాజమాన్యంలోని బారామతి ఆగ్రో కంపెనీతోపాటు, దీనికి అనుబంధంగా ఉన్న సంస్థల్లో శుక్రవారం సోదాలు చేసింది. బారామతి, పుణే, పింప్రి, ఔరంగాబాద్లలో ఆరు చోట్ల సోదాలు జరిగినట్లు ఈడీ అధికారులు తెలిపారు.
నష్టాల్లో ఉన్న సహకార చక్కెర ఫ్యాక్టరీని కొనేందుకు నిధులను మళ్లించారని రోహిత్ పవార్పై ఆరోపణలు వచ్చాయి. చక్కెర మిల్లులను కారుచౌకగా అమ్మేస్తున్నారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని 2019 ఆగస్టు 22న బాంబే హైకోర్టు ఆదేశించింది. ముంబై పోలీస్ శాఖలోని ఆర్థిక నేరాల విభాగం 2019 ఆగస్టులో కేసును నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసును నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నది.