2017లో ఓ స్థల క్రయవిక్రయాల్లో అవకతవకలు జరిగాయంటూ కేసు
తీవ్రంగా ఖండించిన శివసేన నేతలు
ప్రతీకార రాజకీయాలంటూ ఆగ్రహం
న్యూఢిల్లీ/ముంబై, మే 26: మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీ కూటమికి చెందిన మరో నాయకుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టంది. మనీ ల్యాండరింగ్ కేసులో మంత్రి అనిల్ పరాబ్ సహా పలువురి ఇండ్లు, కార్యాలయాల్లో గురువారం తనిఖీలు నిర్వహించింది. రత్నగిరి జిల్లాలోని దపోలీ కోస్తా ప్రాంతంలో 2017లో జరిగిన ఓ స్థలం క్రయవిక్రయాల్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసులో ఈ సోదాలు జరిగాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మంత్రిపై తాజాగా ఈడీ మరో కేసు కూడా నమోదుచేసింది. మహారాష్ట్రలో ఇప్పటివరకూ మహావికాస్ అఘాడీ కూటమి చెందిన డజనుకుపైగా నాయకులపై ఈడీ వివిధ కేసులు నమోదుచేసింది.
కేంద్ర సంస్థల దుర్వినియోగం
మంత్రి ఇంటిపై ఈడీ సోదాలను శివసేన ఖండించింది. ‘ప్రతీకార రాజకీయాలు’ అంటూ మండిపడింది. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీకి గట్టి ప్రత్యర్థి అని భావించిన వారిపై ఈ సంస్థలను ఉసిగొల్పుతున్నదని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలు మహావికాస్ అఘాడీ ప్రభుత్వ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీస్తాయని బీజేపీ భావిస్తే అది తప్పని, మరింత శక్తిమంతంగా మారుతుందని పేర్కొన్నారు. అఘాడీ నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసుల కన్నా తీవ్రమైన కేసులు బీజేపీ నేతలపై ఉన్నాయని, అయినా వారిపై ఈగ కూడా వాలనివ్వడం లేదని చెప్పారు. ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేస్తే బాగుంటుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హితవు పలికారు.