తిరువనంతపురం : కేరళ మాజీ సీఎం పినరయి విజయన్, ఆయన కుమార్తెకు సంబంధించిన నివాసాలపై బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందుకు నిరసనగా సీపీఎం కార్యకర్తలు ఈడీ అధికారుల వాహనంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. సీఎంఆర్ఎల్ నెలసరి చెల్లింపుల కేసుకు సంబంధించి తిరువనంతపురంలోని బేకరీ జంక్షన్లో ఉన్న తన అద్దె ఇంట్లో ఈడీ అధికారులు గంటలపాటు సోదాలు జరిపిన తర్వాత విజయన్ విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులపై జరుపుతున్న దాడుల్లో భాగంగా తన నివాసంలో కూడా ఈడీ సోదాలు నిర్వహించిందని ఆరోపించారు. ఇటువంటి చర్యలు తనను కాని, సీపీఎంను కాని బలహీనపరచబోవని ఆయన చెప్పారు. విపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయోగిస్తున్నదని ఆయన ఆరోపించారు. తనపైన ఈడీ దాడులు కూడా ఆ వ్యూహంలో భాగమేనని ఆయన చెప్పారు. రాహుల్ లాంటి నాయకులకు ఈ సోదాలు మానసిక సంతృప్తిని కలిగించవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
2018, 2019 మధ్యకాలంలో విజయన్ కుమార్తె టీ వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్కు కొచ్చిన్ మినరల్స్ అండ్ రిటైల్ లిమిటెడ్(సీఎంఆర్ఎల్) ఎలాంటి సేవలు తిరిగి పొందకుండా రూ.1.72 కోట్లు చెల్లించిందన్న ఆరోపణలకు సంబంధించి ఈడీ ఈ చర్య తీసుకుంది. పీఎంఎల్ఏ కింద కేరళవ్యాప్తంగా సుమారు 10 ప్రాంగణాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఈడీ విచారణను రద్దు చేయాలని కోరుతూ పీఎంఆర్ఎల్ దాఖలు చేసిన పిటిషన్ను కేరళ హైకోర్టు కొట్టివేసిన మరుసటి రోజే ఈ సోదాలు జరుగడం గమనార్హం.
ఈడీ సోదాలకు నిరసనగా తిరువనంతపురంలో బుధవారం సీపీఎం కార్యకర్తలు ఈడీ అధికారుల వాహనంపై దాడి చేశారు. సోదాల అనంతరం విజయన్ నివాసం నుంచి బయల్దేరుతున్న అధికారుల కారును సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈడీకి వ్యతిరేక నినాదాలు చేస్తూ ఇటుకలు, ఇనుప రాడ్లతో వారు కారుపై దాడిచేసి అద్దాలను ధ్వంసం చేశారు. మహిళా అధికారులు సహా నలుగురు ఈడీ అధికారులు, 8 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్న కాన్వాయ్పై కార్యకర్తలు దాడి చేశారు. డ్రైవర్లలో ఒకరు గాయపడడంతో దవాఖానలో చేర్చి చికిత్స అందచేస్తున్నారు. తిరువనంతపురంలోని విజయన్ ప్రస్తుత నివాసం, కన్నూర్లోని ఆయన స్వగ్రామం, కోజికోడ్లోని ఆయన అల్లుడు, మాజీ మంత్రి మహ్మద్ రియాస్ నివాసం సహా కేరళవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ఈడీ దాడులు జరిగాయి. ఈడీ దాడులు రాజకీయ ప్రేరేపితమైనవని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు విజయరాఘవన్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి విమర్శించారు.