చెన్నై, డిసెంబర్ 31: తమిళనాడుకు చెందిన కన్నయ్యన్, కృష్ణయ్యన్ అనే వృద్ధ దళిత రైతులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నెలల తరబడి వేధిస్తున్నది. సేలం జిల్లా అత్తూరు నివాసులైన ఈ అన్నదమ్ముల కున్నది కేవలం 6.5 ఎకరాల పొలం. అదీ కూడా బీజేపీ నేతతో కోర్టులో వివాదంలో ఉండటంతో సాగు చేయడం లేదు. నెలకు వచ్చే వెయ్యి రూపాయల వృద్ధాప్య పింఛన్, ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యంతోనే వారు జీవనం సాగిస్తున్నారు. అయితే మనీ లాండరింగ్ కేసులో తమ ముందు హాజరు కావాలంటూ ఈ ఏడాది జూలైలో సమన్లు జారీ చేసిన ఈడీ.. వారిని అప్పటి నుంచి విచారణ పేరుతో వేధిస్తున్నది. మీ ఆదాయం ఎంత? ఇన్కం టాక్స్ ఎంత కడుతున్నారు? మీ బ్యాంక్ ఖాతాల్లో ఎంత సొమ్ము ఉంది? మీ పాస్పోర్టు ఏదీ? లాంటి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ రైతులు బిక్కమొహం వేస్తున్నారు. వీరి పరిస్థితికి జాలిపడి పర్వినా అనే లాయర్ వారి తరఫున వెళ్లగా ఆమెకు సైతం ఈడీ పూర్తి వివరాలు అందజేయడం లేదు. బీజేపీ నేత గుణ శేఖర్తో వారికి భూమికి సంబంధించిన వివాదం ఉందని, అది కోర్టులో నడుస్తున్నదని తెలిపారు. బీజేపీ నేతకు సహాయం చేసేందుకు ఈ బక్క రైతులను వేధిస్తున్నారా అని ఆమె ప్రశ్నించారు.