ED | న్యూఢిల్లీ, మార్చి 11: ఈడీ ద్వారా బీజేపీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నదని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో తన కుటుంబీకుల ఇండ్లలో సోదాల సందర్భంగా నిండు గర్భిణి అయిన తన కోడలిని ఈడీ అధికారులు 15 గంటలపాటు కదలకుండా కూర్చోబెట్టారని శనివారం ఆయన ఆరోపించారు. తన కూతుళ్లు, మనుమలు, మనుమరాళ్ల పట్ల కూడా అలాగే ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నేను దేశంలో ఎమర్జెన్సీ రోజులను చూశాను. ఆ చీకటి చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాను.
శుక్రవారం ఈడీ అధికారులు నిండు గర్భవతి అయిన నా కోడలిని 15 గంటలపాటు కూర్చోబెట్టి ఇంట్లో సోదాలు చేశారు. కాషాయ పార్టీ ఈ స్థితికి దిగజారింది. బీజేపీ, ఆరెస్సెస్పై నా సైద్ధాంతిక పోరాటం కొనసాగుతుంది. నేనుగానీ నా కుటుంబ సభ్యులు గానీ బీజేపీకి లొంగే ప్రసక్తే లేదు’ అని ట్వీట్ చేశారు. లాలూ కుమారుడు తేజస్వీయాదవ్తోపాటు కూతుళ్ల ఇండ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో.. లెక్కల్లో చూపని రూ.కోటి నగదును స్వాధీనం చేసుకున్నామని, రూ.600 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించామని ఈడీ శనివారం తెలిపింది.
రైల్వే ఉద్యోగాల కేసులో తమ ముందు విచారణకు హాజరుకావాలని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్కు సీబీఐ శనివారం మరోసారి సమన్లు జారీచేసింది. అయితే, గర్భిణి అయిన తన భార్య దవాఖానలో ఉన్నదని, విచారణకు హాజరుకాలేనని, మరోరోజు హాజరవుతానని తేజస్వీ సమాచారమిచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 4న కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు.
యూపీఏ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 2008 – 09 మధ్య ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వివిధ రైల్వే జోన్లలో గ్రూప్ డీ పోస్టులు ఇచ్చేందుకు అభ్యర్థుల నుంచి లాలూ కుటుంబీకులు ఉచితంగా లేదా తక్కువ ధరలకు భూములను లంచంగా తీసుకున్నారనేది ఈ కేసులో సీబీఐ చేస్తున్న ఆరోపణ. పాట్నాలో 1,05,292 చదరపు అడుగుల స్థలం లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రి దేవీ, కూతుర్లు మీసా భారతి, హేమ యాదవ్ పేర్ల మీదకు బదిలీ అయ్యిందని ఆరోపించింది.
2021 సెప్టెంబరులో ఈ కేసులో సీబీఐ ప్రాథమిక దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గతేడాది జూలైలో లాలూకు ఓఎస్డీగా పని చేసిన భోళా యాదవ్ను సీబీఐ అరెస్టు చేసింది. అక్టోబరులో ఈ కేసులో లాలూతో పాటు రబ్రీ దేవీ, వారి కూతురు మీసా భారతి, ఇద్దరు రైల్వే అధికారులు, భూములు ఇచ్చి అక్రమంగా ఉద్యోగాలు పొందిన ఏడుగురిపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. లాలూపై విచారణ జరపడానికి జనవరిలో కేంద్రం సీబీఐకి అనుమతించింది.
కోల్కతా, మార్చి 11: పశువుల స్మగ్లింగ్ కేసులో వచ్చే వారం విచారణకు హాజరుకావాలని టీఎంసీ సీనియర్ నేత అనుబ్రత మండల్ కుమార్తె సుకన్యకు ఈడీ సమన్లు జారీచేసింది. మరోవైపు, బెంగాల్ టీచర్ల నియామకం కేసులో ఈడీ అధికారులు టీఎంసీ యూత్వింగ్ నేత శాంతను బెనర్జీని శుక్రవారం అరెస్టు చేశారు. కోల్కతాలోని కార్యాలయంలో దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. అసిస్టెంట్ టీచర్ల నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కొల్హాపూర్, మార్చి 11: రెండు నెలల వ్యవధిలో శనివారం రెండోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కగల్లోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నాయకుడు, మాజీ మంత్రి హసన్ ముష్రిఫ్ ఇంటిపై దాడి చేశారు. సహకార చక్కెర మిల్లు కొనుగోలులో రూ.127 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందని, హసన్ ముష్రిఫ్కు దీంతో సంబంధం ఉందని బీజేపీ మాజీ ఎంపీ కిరిట్ సోమయ్య చేసిన ఆరోపణల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ ఆరోపణలను ముఫ్రిష్ తోసి పుచ్చారు. ఇది రాజకీయ చర్య అని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్దిష్టమైన వర్గానికి చెందిన వ్యక్తులను వేటాడుతున్నదని ఆరోపించారు. దాడుల విషయం తెలియగానే భారీగా ఎన్సీపీ కార్యకర్తలు ముష్రిఫ్ ఇంటి వద్దకు చేరుకొని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.