ED | లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులను తీవ్రతరం చేసింది. కేసులు.. నోటీసులు.. సోదాలతో ఆయా పార్టీల నేతలను ఒత్తిడికి గురిచేస్తున్నది. బుధవారం వివిధ రాష్ర్టాల్లో దాడులు నిర్వహించింది. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీని లక్ష్యంగా చేసుకున్నది. ఆ పార్టీ ఢిల్లీ నేత దీపక్ సింగ్లా నివాసంలో సోదాలు జరిపింది. ఆప్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రమైన పంజాబ్లోనూ తనిఖీలు చేపట్టింది. ఆ పార్టీ బలంగా ఉన్న గోవాలో పార్టీ కన్వీనర్కు నోటీసులు జారీ చేసింది. కేరళ సీఎం విజయన్ కుమార్తె వీణా విజయన్పై కేసు నమోదు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఫైర్బ్రాండ్ మహువా మొయిత్రాకు నోటీసులు జారీ చేసింది. ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత హరక్ సింగ్ రావత్కూ నోటీసులు ఇచ్చింది. మరోవైపు, మద్యం పాలసీ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించలేదు. అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది. మరోవైపు మద్యం విధానానికి సంబంధించిన నిజానిజాలను కేజ్రీవాల్ కోర్టులోనే వెల్లడిస్తారని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ చెప్పారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): కేరళ సీఎం విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఈడీ కేసు నమోదు చేసింది. వీణాకు చెందిన ఐటీ కంపెనీ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్కు కొచ్చిన్ మినరల్స్ అండ్ రీటైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) అక్రమంగా చెల్లింపులు చేసిందన్న ఆరోపణలతో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.
సీఎంఆర్ఎల్ అనే సంస్థ వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి 2018-19 మధ్య రూ.1.72 కోట్లు అక్రమ చెల్లింపులు చేసినట్టు ఐటీ శాఖ గుర్తించింది. ఎలాంటి సేవలను అందించకుండానే ఎక్సాలాజిక్కు సీఎంఆర్ఎల్ ఈ చెల్లింపులు చేసినట్టు ఐటీ శాఖ పేర్కొంది. దీంతో ఎక్సాలాజిక్పై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం (ఎస్ఎఫ్ఐఓ) విచారణ జరిపి అక్రమంగా చెల్లింపులు జరిగినట్లు వెల్లడించింది. ఇది పరిగణనలోకి తీసుకొని ఈడీ కేసు నమోదు చేసింది.
తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో భాగంగా గురువారం విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానికి కూడా సమన్లు పంపింది.
కాగా, ప్రశ్నలకు ముడుపుల కేసులో ఇంతకుముందు రెండు సార్లు మహువాకు ఈడీ సమన్లు జారీ చేసినా విచారణకు ఆమె హాజరుకాలేదు. ఇదే కేసులో గత శనివారం సీబీఐ మహువా నివాసాల్లో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా ఈడీ మూడోసారి ఆమెకు సమన్లు జారీ చేసింది. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణల కేసులో మహువాపై విచారణ చేపట్టాలని సీబీఐని లోక్పాల్ ఆదేశించింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గోవా ఆప్ కన్వీనర్ అమిత్ పాలేకర్, పలువురు పార్టీ నేతలకు ఈడీ సమన్లు జారీచేసింది. ఈ నెల 28(గురువారం) పనాజీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని అందులో కోరినట్టు అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించాయి. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అమిత్ పాలేకర్ ఆప్ సీఎం అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఇటీవల మాట్లాడుతూ గోవా ఎన్నికల ప్రచారం కోసం అక్రమ సొమ్ము పంపించారనే ఆరోపణలకు ఏ ఆధారాలు లేవని, ఎలాంటి దర్యాప్తుకైనా తమ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన తర్వాత ఈడీ ఇప్పుడు పంజాబ్పై దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. జామతోటల నష్టపరిహారానికి సంబంధించిన కేసులో బుధవారం ఈడీ అధికారులు చండీగఢ్, మొహాలీ, పాటియాలా, ఫిరోజ్పూర్, బతిండ ప్రాంతాల్లోని పలువురు అధికారులు, ప్రైవేటు వ్యక్తుల ఇండ్లలో సోదాలు నిర్వహించారు. పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజమ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. జామతోటల నష్టపరిహారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వరుణ్ రూజమ్ భార్య సిమ్రత్ప్రీత్ కౌర్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఫిరోజ్పూర్ డిప్యూటీ కమిషనర్ రాజేశ్ ధిమమ్ ఇంట్లోనూ ఈడీ బృందాలు సోదాలు జరిపాయి. రాజేశ్ భార్య జాస్మీన్ కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
నిరసన ర్యాలీకి సన్నద్ధమవుతున్న వేళ
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆదివారం ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఆప్ సన్నద్ధం అవుతున్న వేళ ఈడీ పంజాబ్లో రంగంలోకి దిగడం గమనార్హం.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కంగనా రనౌత్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథేలకు ఎన్నికల సంఘం బుధవారం వేర్వేరుగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారి వ్యాఖ్యలు అగౌరవంగా, దురుద్దేశంతో కూడుకుని ఉన్నాయని ఈసీ వ్యాఖ్యానించింది.
ప్రాథమిక ఆధారాలను బట్టి వీరిద్దరూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని స్పష్టమవుతున్నదని పేర్కొంది. తాము పంపిన షోకాజ్ నోటీసులకు ఈ నెల 29 సాయంత్రం లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు గౌరవంతో, హుందాగా వ్యవహరించాలని ఈసీ ఈ సందర్భంగా సూచించింది. ఎన్నికల సందర్భంగా ఏ రాష్ర్టానికి వెళ్తే ఆ రాష్ట్రం కుమార్తెనని మమతా బెనర్జీ చెపుతున్నారని, ఇంతకీ ఆమె తండ్రి ఎవరో స్పష్టం చేయాలని దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత హరక్ సింగ్ రావత్కు ఈడీ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఏప్రిల్ 2న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఫిబ్రవరి 7న హరక్ సింగ్ ప్రాంగణాలపై దాడి చేసి 1.2 కోట్ల నగదు, బంగారం, ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరి 29న తమ ముందు హాజరు కావాలని నోటీసులు పంపినప్పటికీ, వేరే పని ఉన్నందున దానిని వాయిదా వేయాలంటూ ఆయన కోరారు. దీంతో ఈడీ తాజాగా మరోసారి నోటీసులు పంపింది.