Rana Ayyub | జర్నలిస్ట్ రాణా అయ్యూబ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జ్షీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ కేసులో జర్నలిస్టు రాణా అయ్యూబ్పై ఈడీ అభియోగాలు మోపింది. కెట్టో.కామ్ వెబ్సైట్ ద్వారా దాతృత్వం పేరుతో సేకరించిన నిధులను దుర్వినియోగం చేశారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఆమెపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన దర్యాప్తు సంస్థ ఫిబ్రవరి నెలలో రూ. 1.77 కోట్లను అటాచ్ చేసింది.
గ్లోబల్ మీడియా హౌస్కు ఆర్టికల్స్ రాసే జర్నలిస్ట్ రాణా అయ్యూబ్.. కొవిడ్ -19 సమయంలో ప్రజలకు సహాయం చేయాలన్న సాకుతో పెద్ద మొత్తంలో నిధులు సేకరించి తన వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాణా అయ్యూబ్ ఈ నిధులను దుర్వినియోగం చేశారని, వ్యక్తిగత ఖర్చుల కోసం నిధులను మరో ఖాతాలోకి మళ్లించినట్లు ఈడీ అధికారి ఒకరు తెలిపారు. ఆ సమయంలో రాణా అయ్యూబ్ దాదాపు రూ.2.69 కోట్ల నిధులు అందుకున్నారని, వీటిలో దాదాపు రూ.80.49 లక్షలు విదేశీ కరెన్సీ రూపంలో అందుకున్నట్లు ఆయన చెప్పారు.
తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన రాణా అయ్యూబ్.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తానున్నందునే ఈడీతో ఈ విధమైన ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. వికాస్ సాంకృత్యాయన్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది.