న్యూఢిల్లీ : జర్నలిస్ట్ రాణా ఆయూబ్పై మనీలాండింగ్ ఆరోపణల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఘజియాబాద్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. గతేడాది ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నది. రాణా ఆయూబ్ స్వచ్ఛంద సంస్థ పేరుతో ప్రజల నుంచి అక్రమంగా విరాళాలు సేకరించి.. మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అయిన కెట్టో ద్వారా మూడుసార్లు విరాళాలు సేకరించిందని ఈడీ ఆరోపించింది.
అసోం, బిహార్, మహారాష్ట్రల్లో వచ్చిన వరదల సమయంలో సహాయక చర్యలు, కరోనా కష్టకాలంలో దేశంలో కరోనా కష్టకాలంలో బాధితులకు సహాయం అందించేందుకు 2020-21 మధ్యకాలంలో కెట్టో అనే ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ద్వారా 2.69 కోట్లకుపైగా విరాళాలు సేకరించి, నిబంధనలు ఉల్లంఘించారని గుర్తించారు. అయితే, కెట్టో ద్వారా సేకరించిన ప్రతి పైసాకు లెక్క ఉందని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని జర్నలిస్ట్ రాణా ఆయూబ్ తెలిపింది.
అయితే, పూర్తిగా ముందస్తు ప్రణాళికతో, క్రమపద్ధతిలో స్వచ్ఛంధ సంస్థ పేరుతో నిధులు సేకరించారని, వాటిని పూర్తిగా ఉపయోగించలేదని ఈడీ ఆరోపిస్తున్నది. విరాళాలను కుటుంబ సభ్యులు, వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేశారని, కేవలం రూ.29 లక్షలు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, సహాయక పనులు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆమోదం, రిజిస్ట్రేషన్ లేకుండా విదేశాల నుంచి విరాళాలను స్వీకరించారని ఈడీ చార్జిషీట్లో పేర్కొంది.