ECI notice : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను తమ్లూక్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ్కి కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీస్ జారీచేసింది. ఈ నెల 15న హల్దియాలో జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచార సభలో మమతాబెనర్జి గురించి గంగోపాధ్యాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అభిజిత్ గంగోపాధ్యాయ్ వ్యాఖ్యలపై ఈసీ ప్రాథమిక విచారణ పూర్తిచేసింది. ఆ వ్యాఖ్యలు మార్చి 1న తాము విడుదల చేసిన మినిమమ్ కామన్ కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీచేసింది. మే 20 లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది.