న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా విస్తృతంగా ఏర్పాటు చేసిన అనామక రాజకీయ హోర్డింగ్లపై ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. ఊరూపేరూ లేకుండా ఎవరు ఏర్పాటు చేశారో తెలియకుండా పార్టీలకు ప్రచారం చేస్తున్న హోర్డింగ్లపై దృష్టి సారించింది. అభ్యర్థులు తాము ప్రచారం చేసే కరపత్రాలు, హోర్డింగ్లు, ఇతర ప్రచార సామగ్రిపై తప్పనిసరిగా ప్రింటర్, పబ్లిషర్ పేరును స్పష్టంగా ప్రచురించాలని ఆదేశించింది.
ఎన్నికల ప్రచారంలో పారదర్శకత కోసం ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. మున్సిపల్ శాఖ, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఇప్పటికే పలు చోట్ల ఏర్పాటు చేసిన కొన్ని హోర్డింగ్ల ద్వారా చేస్తున్న పార్టీ ప్రచారంలో ఆయా పబ్లిషర్, ప్రింటర్ పేర్లు ఉండటం లేదంటూ ఆప్, మరికొందరి నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిశీలించిన అనంతరం ఈసీ ఈ ఆదేశాలిచ్చింది.