Congress Gurrantees | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాజస్థాన్లో ఓటర్లను మాయ చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న యత్నాలకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. 7 గ్యారంటీల లబ్ధి పొందాలంటే ప్రజలు మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ ఆ పార్టీ చేస్తున్న ఐవీఆర్ఎస్ ఆడియో ప్రచారాన్ని ఈసీ బుధవారం నిలిపివేసింది.
హామీల్లో ఇచ్చిన ఏడు పథకాలను అమలు చేస్తామంటూ సీఎం అశోక్ గెహ్లాట్ గొంతుతో కాంగ్రెస్ వాయిస్ కాల్ ప్రచారం చేస్తున్నది. మరో కాల్ ద్వారా ఆయా పథకాల లబ్ధి పొందాలంటే నిర్దిష్ట మిస్డ్ కాల్ ఇచ్చి పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని చెబుతున్నది. ఇలాంటి ఐవీఆర్ఎస్ ప్రచారానికి అనుమతి తీసుకోలేదని, నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంటూ ఎన్నికల సంఘం ఆ ప్రకటనలను నిలిపేసింది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీల నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.
ఓటర్లను మోసగించేందుకు కాంగ్రెస్ ఈ విధమైన ప్రచారానికి దిగిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎన్నికలు పూర్తి కాలేదు, గెలవలేదు గానీ.. పథకాలకు ఎంపిక అయినట్టు, పేర్లు ముందే నమోదు చేసుకోవాలంటూ చేస్తున్న కాల్స్ వెనుక కుట్ర ఉన్నదని అంటున్నాయి. మిస్డ్ కాల్ ఇచ్చిన నంబర్లను నమోదు చేసుకొని, కాంగ్రెస్ ఆ తర్వాత తమ వైపు తిప్పుకొనేందుకు వారిని ఫోన్లకు వరుస మేసేజ్లు పంపుతున్నట్టు తెలుస్తున్నది. అసలు గెలువకుండా, ప్రభుత్వం ఏర్పాటుకాకుండా.. కాంగ్రెస్ ఆయా గ్యారెంటీ పథకాలను మిస్డ్ కాల్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని ప్రచారం చేయడం పచ్చి మోసమని ఎన్నికల పరిశీలకులు ఆరోపిస్తున్నారు.
ప్రకటనలకు సంబంధించి ఎన్నికల సంఘం స్పష్టమైన నిబంధనలను పేర్కొన్నది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఇచ్చే ప్రకటనలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రసారమయ్యే ప్రకటనల ముసాయిదాలను ముందుగా ఈసీకి సమర్పించి, అనుమతి తీసుకోవాలి. అయితే కాంగ్రెస్ వాయిస్ కాల్ లాంటి ప్రచారానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదు.