గౌహతి: అస్సాంలో మూడు నియోజకవర్గాల పరిధిలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 20న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్ణయించింది. రతాబరి, సోనాయ్, హఫ్లాంగ్ నియోజకవర్గాల్లోని నాలుగు కేంద్రాల్లో ఈ నెల 1న జరిగిన పోలింగ్ సంబంధిత చట్టాల్లోని సెక్షన్ల ప్రకారం చెల్లదని ప్రకటించి తిరిని ఎన్నికలు నిర్వహించాలని అస్సాం చీఫ్ ఎలక్షన్ అధికారికి శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 20న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీ పోలింగ్ జరుపాలని, దీనిపై ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు లేఖలు, ప్రకటనలు ఇతర మార్గాల ద్వారా సమాచారం అందించాలని పేర్కొంది.
ఈ నెల 1న జరిగిన రెండో దశ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కారులో ఒక ఈవీఎం లభించడం కలకలం రేపింది. అలాగే ఒక పోలింగ్ బూత్ పరిధిలో 90 మంది ఓటర్లు ఉండగా 181 ఓట్లు పోలయ్యాయి. ఇలాంటి సంఘటనలు జరిగిన నాలుగు పోలింగ్ బూత్లలో ఈ నెల 20న తిరిగి పోలింగ్ నిర్వహించనున్నారు.
మరోవైపు ఈ నెల 6న జరిగిన మూడో దశ పోలింగ్తో అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మే 2న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.