Bye Elections | దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఒక లోక్సభ స్థానానికి, నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వచ్చేనెల 12వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఈ ఏడాది రాష్ట్రపతి ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో ఎలక్టోరల్ కాలేజీలో ఖాళీలను భర్తీ చేయాలని ఈసీ నిర్ణయించింది. పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా బాబుల్ సుప్రియో రాజీనామా చేశారు. దీంతో అసన్సోల్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
పశ్చిమబెంగాల్లోని బాలిగుంగే, ఛత్తీస్గఢ్లోని ఖైరాగఢ్, బీహార్లోని బోచహన్, మహారాష్ట్రలోని కొల్హాపూర్ నార్త్ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. వచ్చేనెల 16న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఐదు స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణకు ఈ నెల 17న ఈసీ నోటిఫికేషన్ జారీ చేయనున్నది. నామినేషన్లు దాఖలు చేయడానికి తుది గడువు మార్చి 24. ఈ నెల 25న నామినేషన్లను పరిశీలిస్తారు. మార్చి 28 లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు.