పాట్నా: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ‘చేప కాకపోతే పంది, ఏనుగు లేదా గుర్రాన్ని తిను, చూపించడం ఎందుకు?’ అని విమర్శించారు. (Rajnath Singh Slams Tejashwi Yadav) బీహార్లోని జమూయిలో ఎన్డీయే అభ్యర్థి, ఎల్జేపీ (రామ్ విలాస్) పార్టీ నేత అరుణ్ భారతికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్నాథ్ సింగ్, లాలూ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారు.
కాగా, తేజస్వీ యాదవ్ చేప తిన్న వీడియో క్లిప్ ఇటీవల వైరల్ కావడం గురించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ‘నవరాత్రులలో చేపలు తిన్నావు. ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు? చేప, పంది, పావురం, ఏనుగు, గుర్రం ఏది కావాలంటే అది తిను. చూపించాల్సిన అవసరం ఏముంది? ఇది ఓట్ల రాజకీయం కోసమే. ఒక మతానికి చెందిన ప్రజలు తమకు ఓటు వేస్తారని వారు భావిస్తున్నారు’ అని ఆరోపించారు.
మరోవైపు ‘ఇండియా’ బ్లాక్ అధికారంలోని వస్తే ఎన్నికల బాండ్ల స్కామ్కు పాల్పడిన మోదీ, బీజేపీ నేతలు జైలుకు వెళ్తారంటూ లాలూ యాదవ్ కుమార్తె మిసా భారతి చేసిన వ్యాఖ్యలను రాజ్నాథ్ సింగ్ తిప్పికొట్టారు. జైలులో ఉన్నవారు, బెయిల్పై ఉన్నవారు ప్రధాని మోదీని జైలుకు పంపడం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వారిని (కొడుకు, కూతుర్ని) నియంత్రించాలని లాలూను కోరుతున్నానని రాజ్నాథ్ సింగ్ అన్నారు.