బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు పేర్కొన్నారు. అయితే బెంగళూరుతో పాటు పరిసరాల్లో ఎక్కడా కూడా భూకంప కేంద్రం కేంద్రీకృతం కాలేదని కర్ణాటక డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు స్పష్టం చేశారు.
బెంగళూరు నగంరలోని రాజరాజేశ్వరీనగర్, కింగేరి, కగ్గలిపుర, హెమ్మిగిపుర, యశ్వంత్పూర్ ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. పెద్ద పెద్ద శబ్దాలు కూడా వచ్చినట్లు చెప్పారు. ఈ ప్రకంపనలు శుక్రవారం ఉదయం 11:50 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య సంభవించినట్లు పేర్కొన్నారు.
బెంగళూరుకు సమీప జిల్లాలైన మండ్యా, రామ్నగర్ జిల్లాల్లో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినట్లు తెలిపారు. బెంగళూరు సరిహద్దుల్లోని జిగాని, అనేకల్ ఏరియాల్లో మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో పెద్ద శబ్దాలతో పాటు స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు వెల్లడించారు.