న్యూఢిల్లీ : గంగా నది నుంచి ఆదాయాన్ని ఆర్జించాలని కేంద్రం యోచిస్తున్నది. నీటిని శుద్ధి చేసి విక్రయించాలని భావిస్తున్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా త్వరలోనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) విక్రయాలు ప్రారంభించనున్నది. గంగా నది ఒడ్డు నుంచి రోజుకు దాదాపు 12వేల లక్షల లీటర్ల (ఎంఎల్డీ) మురుగు నీరు బయటకు వస్తుంది. ఐఓసీకి నీటిని సరఫరా చేయడంతో.. ఈ శుద్ధి చేసిన నీటి విక్రయాలు ప్రారంభమవుతాయని క్లీన్ గంగా మిషన్ (NMCG) డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ పేర్కొన్నారు. మధుర నుంచి శుద్ధి చేసిన గంగా జలాల విక్రయాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఐఓసీఎల్కు దాదాపు 20ఎంఎల్డీ నీరు ఇవ్వనున్నారు. మధుర ఎస్టీపీ నుంచి ఐఓసీఎల్కు అవసరమైన నీటిని సరఫరా చేయనున్నారు. నెల రోజుల్లో కార్యక్రమం ప్రారంభం కానున్నది. గంగా నది నుంచి తొలగించిన మురుగు, మురుగు నీటిని ఎస్టీపీల్లో శుద్ధి చేస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత పరిశ్రమలకు విక్రయించేందుకు అనువుగా మారనున్నాయి. శుద్ధి చేసిన నీరు స్నానం చేసేందుకు వీలుగా ఉంటాయని, అలాగే పరిశ్రమల్లోనూ వినియోగించుకోవచ్చని క్లీన్ గంగా మిషన్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. పరిశ్రమల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించడం వల్ల నదుల నుంచి స్వచ్ఛమైన నీటి వినియోగం తగ్గుతుందన్నారు.
ఇంతకు ముందు పరిశ్రమలకు శుద్ధి చేసిన నీరు తక్కువగా అందుబాటులో ఉండేది. ఎందుకంటే ఎస్టీపీల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. వీటిని చాలా ఏళ్ల కిందట నిర్మించగా.. వీటిలో కొన్ని ఎస్టీపీలకు విద్యుత్ కనెక్షన్ కూడా లేదు. కొన్ని విద్యుత్ సరఫరా సైతం సక్రమంగా ఉండడం లేదు. ప్రస్తుతం ఎస్టీపీలు పని చేస్తున్నాయని, వాటిని మానిటైజ్ చేసేందుకు ప్రణాళిక రూపొందించామని అధికారులు పేర్కొన్నారు. ఇంకా ఎన్ఎంసీజీ డైరెక్టర్ జనరల్ కుమార్ మాట్లాడుతూ సహజ వ్యవసాయంగా గంగా నది ఒడ్డున ఈ నీటితో ఔషధ మొక్కలను ఎలా సాగు చేయొచ్చో ఆయూష్ మంత్రిత్వశాఖతో మాట్లాడుతున్నామన్నారు.
తద్వారా రైతులు నదీ తీరాల్లో ఔషద మొక్కల పెంపకం చేపట్టి జీవనోపాధి పొందవచ్చన్నారు. ఎన్ఎంసీజీ దృష్టి ప్రస్తుతం ‘అర్థ్ గంగ’పైనే ఉందన్నారు. ప్రజలను నదులతో అనుసంధానించడం, రెండింటి మధ్య ఆర్థిక సంబంధాన్ని ఇందులో భాగమన్నారు. అర్థ్ గంగ కోసం రెండు నెలలుగా శ్రమిస్తున్నామన్నారు. 2015లో ప్రధాని మోదీ ప్రభుత్వం ‘నమామి గంగే’ మిషన్ను ప్రారంభించింది. గంగా శుద్ధి అన్ని పథకాలను ఏకీకృతం చేయడం దీని ఉద్దేశం. ఈ కార్యక్రమం కింద రూ.30,255కోట్లతో మొత్తం 347 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.