భోపాల్, సెప్టెంబర్ 11: ద్వారక శారదా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం చెందారు. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలో 99 ఏండ్ల వయసులో గుండెపోటుతో మధ్యాహ్నం 3.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన గత ఏడాది నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మధ్యప్రదేశ్లోని సియోనీ జిల్లా దిఘోరీ గ్రామంలో పోతిరాం ఉపాధ్యాయగా 1924లో ఆయన జన్మించారు. దైవ చింతనతో 9 ఏండ్ల వయసులోనే ఆయన ఇంటిని విడిచిపెట్టారు.
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో రెండు సార్లు జైలుకు వెళ్లారు. ఆయనను ‘విప్లవ సాధువు’గా అభివర్ణిస్తారు. 1981లో ద్వారకా పీఠానికి శంకరాచార్యులు అయ్యారు. సోమవారం మధ్యాహ్నం గోటేగావ్లోని జ్యోతేశ్వర్లో ఉన్న పరమహంసి గంగా ఆశ్రమంలో ఆయన ధ్యానముద్రలో సమాధి కానున్నారని ఆశ్రమ వర్గాలు తెలిపాయి. ఆదిశంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాల్లో ద్వారకా పీఠం ఒకటి.
వివాదాలకు కేరాఫ్..
స్వామి స్వరూపానంద సరస్వతి చాలాసార్లు తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. షిరిడీ సాయిబాబాను హిందూ దేవుళ్లతో సమానంగా కొలవడమేంటని ప్రశ్నించారు. ఆయన దేవుడని ఏ శాస్ర్తాలు, వేదాల్లో ఉందో చెప్పాలని వ్యాఖ్యానించారు. ఆయన దేవుడు కాదని, కేవలం ఫకీరు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనిశింగనాపూర్లోని శని విగ్రహానికి మహిళలు పూజలు చేస్తే వారిపై అత్యాచారాలు, దాడులు పెరుగుతాయంటూ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్పై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. హిందూ పేరును ఆర్ఎస్ఎస్ వాడుకుంటున్నదని, కానీ హిందూత్వను కాపాడాలనే నిబద్ధత లేదని ఆయన చురకలంటించారు. దేశంలో విలువలు, నైతిక ప్రవర్తన లేకపోవడం వల్లే దేశంలో అవినీతి పేరుకుపోయిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370, యూనిఫాం సివిల్ కోడ్, గోవధ, బీఫ్ ఎగుమతులు, ఇస్కాన్ టెంపుల్, గంగా నది ప్రక్షాళన తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ఆయన తనదైన రీతిలో స్పందించేవారు. ఆంగ్కోర్ వాట్ లోని శివుడి దేవాలయం మాదిరిగా అయో ధ్యలో రాముడి గుడి నిర్మించాలని కోరారు.
ప్రముఖుల సంతాపం..
స్వామి స్వరూపానంద సరస్వతి మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం గొప్ప వ్యక్తిని కోల్పోయిందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.