చండీఘఢ్ : రాష్ట్రంలో రైతులకు తమ ప్రభుత్వం కనీస మద్దతు ధర అమలు చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం హర్యానా మోడల్ను అనుసరించాలని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను పార్లమెంట్లో వెనక్కితీసుకుందని, ఎంఎస్పీపై చర్చలకు సిద్ధంగా ఉందని రైతులు ఆందోళన విరమించి ఇండ్లకు వెళ్లాలని చౌతాలా కోరారు.
హర్యానా ప్రభుత్వం గత రెండు పంటలకు గాను ధాన్యానికి మద్దతు ధరగా రూ 30,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిందని చెప్పారు. చౌతాలాకు చెందిన జేజేపీ హర్యానా ప్రభుత్వంలో బీజేపీకి భాగస్వామ్య పక్షంగా వ్యవహరిస్తోంది.
ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతులకు జేజేపీ నేత దిగ్విజయ్ చౌతాలా మద్దతు ప్రకటిస్తూ నిరసనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన నేపధ్యంలో దుష్యంత్ చౌతాలా ఎంఎస్పీ, రైతాంగ సమస్యలపై స్పందించడం గమనార్హం.