ముంబై: విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఆయన పేరు శంకర్ మిశ్రా అని తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన వెల్స్ ఫార్గో అనే అమెరికన్ బహుళజాతి సంస్థ తరుఫున భారత్లో వైస్ ప్రెసిడెంట్గా ఆయన పని చేస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలోని ముంబైలో నివసించే శంకర్ మిశ్రా, నవంబర్ 26న న్యూయార్క్- ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్లో ప్రయాణించినట్లు తెలిపారు. మద్యం మత్తులో విమాన ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేయడంతో ఆమె ఆ సంస్థకు ఫిర్యాదు చేసిందన్నారు.
కాగా, డిసెంబర్ 28న ఎయిర్ ఇండియా సంస్థ నుంచి ఈ విషయం తెలిసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఆ మహిళను సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఎయిర్ ఇండియాకు ఇచ్చిన ఫిర్యాదును పరిగణించాలని ఆమె కోరిందన్నారు. బుధవారం ఉదయం ఎయిర్ ఇండియా నుంచి ఆ మహిళ ఫిర్యాదు వివరాలు అందుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో దీనిపై కేసు నమోదు చేయడంతోపాటు శంకర్ మిశ్రాను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
మరోవైపు, శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా ఇప్పటికే చర్యలు చేపట్టింది. తమ సంస్థ విమానాల్లో ప్రయాణించడంపై నెల రోజుల పాటు నిషేధం విధించింది. అలాగే మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన సంఘటనపై డెరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు గురువారం నివేదిక ఇచ్చింది.