ముంబై, అక్టోబర్ 29: మహారాష్ట్రలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు మరో భారీ డ్రగ్ రాకెట్ను ఛేదించారు. ఆదివారం ఛత్రపతి శంభాజీనగర్లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి ద్రవరూపంలో ఉన్న 160 కోట్ల రూపాయల విలువైన 107 లీటర్ల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. అపెక్స్ మెడికెమ్ ప్రైవేట్ లిమిటెడ్లో శనివారం జరిపిన తనిఖీల సందర్భంగా ఈ లిక్విడ్ మెఫెడ్రోన్ గురించి బయటపడినట్టు అధికారులు తెలిపారు. ఇటీవల సింథటిక్ డ్రగ్స్ వాడకం అధికం కావడం, కొందరు పరిశ్రమల పేరిట ఇలా అక్రమంగా డ్రగ్స్ తయారీ పెరగడంతో దాడులు నిర్వహిస్తున్నట్టు వారు చెప్పారు.