Drugs Recovered | అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్గార్డ్, గుజరాత్ ఏటీఎస్, ఎన్సీబీ సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ జాయింట్ ఆపరేషన్లో ఆరుగురు పాకిస్తానీ పౌరులను అదుపులోకి తీసుకోవడంతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నది. ఈ విషయాన్ని ఎన్సీబీ అధికారులు సమాచారం అందించారు. అయితే, అరెస్టయిన పాకిస్తానీల నుంచి రూ.480కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
భారత కోస్ట్ గార్డ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సంయుక్తంగా అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలోని అరేబియా సముద్రంలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఎన్సీబీ సూపరింటెండెంట్ సునీల్ జోషి తెలిపారు. ఈ నెల 11-12 మధ్యన రాత్రి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. పోరబందర్కు 350 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో భారత తీర రక్షక దళ నౌకలు, డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ సమన్వయంతో సీ-ఎయిర్ ఆపరేషన్లో పడవను అడ్డగించినట్లు తెలిపారు.
బోటు నుంచి ఆరుగురు సిబ్బంది, 80 కిలోల డ్రగ్స్ స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.480 కోట్లు ఉంటుందని చెప్పారు. గత నెలలో అరేబియా సముద్రంలో ఏజెన్సీలు నిర్వహించిన రెండో అతిపెద్ద యాంటీ నార్కోటిక్ ఆపరేషన్ అన్నారు. ఫిబ్రవరి 26న పోర్బందర్ తీరంలో ఐదుగురు విదేశీయులు హషీష్తో సహా 3,300 కిలోల మాదక ద్రవ్యాలతో పట్టుబడిన విషయం తెలిసిందే.