జమ్ము: జమ్ముకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాజౌరి జిల్లాలో డ్రోన్లు, తక్కువ ఎత్తులో ఎగిరే వాటిపై నిషేధం విధించారు. జమ్ము ఎయిర్ బేస్పై ఆదివారం డ్రోన్ల దాడి జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాడి జరిపిన డ్రోన్లను పాకిస్థాన్ నుంచి ఆపరేట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. సరిహద్దులోని రాజౌరి ప్రాంతంలో ఇటీవల డ్రోన్ల కదలికలను గుర్తించడంతో జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఆర్కే శావన్ ఈ మేరకు బుధవారం నిషేధిత ఉత్తర్వులు జారీ చేశారు. మ్యాపింగ్, సర్వేలు, నిఘా కోసం డ్రోన్లను ఉపయోగించే ప్రభుత్వ సంస్థలు ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కు తెలియజేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.