GPS | కొచ్చి, అక్టోబర్ 2: భారీ వర్షంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను, గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని కారును నడిపినందుకు ఇద్దరు యువ వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు నేరుగా పెరియార్ నదిలోకి దూసుకెళ్లడమే ఈ విషాదానికి కారణం. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాదాపు 12.30 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. త్రిసూర్ జిల్లాలోని ఓ ప్రైవేటు దవాఖానలో వైద్యులుగా పనిచేస్తున్న అద్వైత్ (29), అజ్మల్ (29) శనివారం రాత్రి విధులు ముగించుకుని హోండా సివిక్ కారులో ఇండ్లకు బయల్దేరారు. వీరితోపాటు డాక్టర్ తబ్సిర్, ఎంబీబీఎస్ విద్యార్థిని తమన్నా, నర్సు జిస్మాన్ కూడా ఆ కారులో ఎక్కారు. డ్రైవర్ సీటులో డాక్టర్ అద్వైత్ కూర్చున్నాడు. మర్నాడు అతని పుట్టినరోజు కావడంతో మార్గం మధ్యలో షాపింగ్ చేసి బయల్దేరారు. ఆ సమయంలో భారీ వర్షం పడుతుండటంతో రోడ్డు సరిగా కనిపించలేదు. దీంతో గూగుల్ మ్యాప్స్ను అనుసరిస్తూ కారును నడుపుతున్న అద్వైత్.. ఆ మార్గం మధ్యలో నీరు నిలిచి ఉన్న ఓ ప్రాంతాన్ని రోడ్డుగా భ్రమించాడు. కారును వేగంగా ఆ నీటిలోకి నడిపాడు. కానీ, అది పెరియార్ నది అని గుర్తించేలోపే ఆ కారు నీటిలో మునిగిపోయింది. దీంతో స్థానికులు స్పందించి ముగ్గురిని రక్షించారు. అద్వైత్, అజ్మల్ ప్రాణాలు కోల్పోయారు.
ఈ దుర్ఘటన నేపథ్యంలో ప్రయాణాలకు టెక్నాలజీని ఉపయోగించడంపై కేరళ పోలీసులు సరికొత్త మార్గదర్శకాలను జారీచేశారు. ప్రత్యేకించి వర్షాకాలంలో జీపీఎస్ను, గూగుల్ మ్యాప్స్ను వినియోగించవద్దని సూచించారు. సాధారణంగా వానకాలంలో రోడ్డు మార్గాలను తరచుగా మళ్లించడం జరుగుతుందని, కానీ ఆ డైవర్షన్లు గూగుల్ మ్యాపుల్లో కనిపించకపోవచ్చని హెచ్చరించారు. ‘ప్రస్తుత కాలంలో డ్రైవింగ్కు గూగుల్ మ్యాప్లు ఉపయుక్తమైనవే అయినప్పటికీ వాటిని అనుసరిస్తూ తెలియని మార్గాల్లో వాహనాలను నడపడం, ముఖ్యంగా వర్షాకాలంలో గూగుల్ మ్యాప్లను నమ్ముకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు.