బెంగళూరు: వివిధ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసే ఉద్యోగార్థుల డ్రెస్ కోడ్లో కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. తల భాగాన్ని పూర్తిగా కప్పి ఉంచే టోపీలు, దుస్తులను అనుమతించబోమని కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ (KEA) తేల్చి చెప్పింది. పరీక్షల్లో బ్లూటూత్ పరికరాలు ఉపయోగించి మాల్ ప్రాక్టీస్కు పాల్పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజా ఉత్తర్వుల్లో KEA పేర్కొన్నది.
ఉద్యోగ నియామక బోర్డులు, కార్పొరేషన్ నియమాక పరీక్షల్లో తలను కప్పి ఉంచే అన్ని రకాల దస్తులను నిషేధిస్తున్నట్లు KEA తెలిపింది. అయితే, పరీక్షలకు హాజరయ్యే మహిళా అభ్యర్థులు మంగళసూత్రం ధరించవచ్చని, అదేవిధంగా కాలి మెట్టెలు కూడా ధరించవచ్చని స్పష్టం చేసింది. వివాహిత మహిళలు పరీక్షలకు హాజరైతే గతంలో మంగళసూత్రాలు, కాలి మెట్టెలు, ఉంగరాలను అనుమతించేవారు కాదు. రైట్ వింగ్ సంస్థల నిరసనల నేపథ్యంలో తాజాగా వాటిని పరీక్షా సంఘం అనుమతించింది. హిజాబ్ తరహా వస్త్రాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తెలిపింది.
గత ఏడాది నుంచి కర్ణాటక వ్యాప్తంగా హిజాబ్ నిరసనలు జరిగాయి. తాజాగా పేర్కొన్న మార్గదర్శకాల్లో హిజాబ్ గురించి నేరుగా పేర్కొనకపోయినప్పటికీ, తల, చెవులను కప్పి ఉంచే వస్త్రాలపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. దాంతో హిజాబ్పై కూడా నిషేధం విధించినట్లైంది. రాష్ట్రంలోని వివిధ పరీక్ష బోర్డులు, కార్పొరేషన్లు రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎగ్జామ్ బోర్డు ఈ ప్రకటన చేసింది.