హైదరాబాద్ : శాస్త్ర, సాంకేతిక అంశాల్లో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ నిలిచిందని, రాబోయే రోజుల్లో యువత మరిన్ని పరిశోధనలు చేపట్టి అగ్రగామిగా నిలుపాలని డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డి పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏపీ విజయవాడలోని స్కూల్ అండ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో నిర్వహిస్తున్న ‘రక్షణ పరిశోధన – అభివృద్ధి సంస్థ, విజ్ఞాన్ ప్రసార్ సంయుక్త వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన తిలకించారు. ‘ఆజాదీ అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఇస్రో, డీఆర్డీవో ఎన్ఐటీలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పాల్గొని, శాటిలైట్లు, ఇతర నమూనాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశ ప్రగతిని, భవిష్యత్తులో సాధించాల్సిన అభివృద్ధి విద్యార్థులకు వివరించారు. భారతదేశం అన్ని రంగాల్లోనూ గణనీయమైన ప్రగతి సాధించిందని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక అంశాల్లో అభివృద్ధి చెందిన ఐదారు దేశాల సరసన భారత్ నిలిచిందన్న ఆయన.. 2047 నాటికి అన్ని రంగాల్లోనూ ప్రపంచంలోనే భారత్ను అగ్రగామిగా నిలుపాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారని చెప్పారు. దేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువత ఉన్నారని, వీరిలో అధిక శాతం పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఆసక్తి చూపుతున్నారని సతీశ్రెడ్డి అన్నారు. ఇటీవల 60వేల స్టార్టప్లు ప్రారంభం కావడమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.
యువత మేథోసంపత్తే దేశానికి దన్ను అని.. ఇందుకు విశ్వవిద్యాలయాలే గొప్ప వేదికలు అని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలతో అర్జున్ ట్యాంక్ను తయారు చేసినట్లు చెప్పారు. రోదసీ రంగంలో అమెరికా, చైనా, రష్యాలతో భారత్ పోటీపడుతుందన్నారు. చంద్రుడు, అంగారక గ్రహాలపై పరిశోధనలకు చంద్రయాన్, మంగళయాన్లను చేపట్టామన్నారు. ప్లాస్టిక్ను నిర్మూలించి, పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో ప్లాస్టిక్ బ్యాగ్ల స్థానంలో పర్యావరణ హితమైన బయోడిగ్రేడబుల్ బ్యాగ్లను డీఆర్డీవో రూపొందించిందని గుర్తు చేశారు. ఈ పరిజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తామని, ఆ బ్యాగ్లను విరివిగా తయారు చేయాలని సతీశ్రెడ్డి పిలుపునిచ్చారు.