ఫొటోను చూడగానే భయంతో ఒళ్లు జలదరిస్తున్నది కదూ. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా షెండ్రిపడా ప్రాంతంలోనిదీ చిత్రం. షెండ్రిపడా గ్రామం నుంచి తమ గూడానికి వెళ్లాలంటే అక్కడి ఆదివాసీలు మధ్యలో ఉన్న తాస్ నదిని దాటాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం నిర్మించిన ఉక్కువంతెన ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో చేసేదేమీలేక గిరిజన మహిళలు నెత్తిపై నీటి బిందెలు పెట్టుకొని కర్రల సాయంతో ఇలా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. కొట్టుకుపోయిన ఆ ఉక్కు వంతెన దశాబ్దాల క్రితం నిర్మించిందనుకుంటే పొరపాటే. 7 నెలల కిందటే దాన్ని కట్టారు.
గొప్ప చదువులు చదువుకొని వృద్ధిలోకి రావాలన్నది ఆ గిరిజన పిల్లల ఆకాంక్ష. అందుకే స్కూల్లో బెంచీలు లేకపోయినా కటిక నేలపై కూర్చొని అక్షరాలు దిద్దుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తరగతి గది పైకప్పు చూరు నుంచి వాననీరు ధారగా కారుతున్నది. అయినప్పటికీ, తరగతి గదిలోనే గొడుగులు పట్టుకొని పాఠాలను వినాల్సిన దుస్థితి వారిది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని శివనీ జిల్లా ఖైరికాలా గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోనిది ఈ చిత్రం.