Ram Mandir : అయోధ్య రామమందిరంలో జరిగిన విరాళాల దుర్వినియోగం, అవకతవకల అంశంపై సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని సూచించింది. విరాళాల దుర్వినియోగం, మాయం అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని, అలాగే, మందిరానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహన్ ఆధ్వర్యంలోని బెంచ్ సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది క్రిమినల్ విచారణకు సంబంధించిన అంశం అని, దీన్నిరాజకీయ అంశంగా మార్చవద్దని సూచించారు. అలాగే, ఈ అంశంలో కొన్ని సూచనలు జారీ చేస్తామని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన స్టేటస్ రిపోర్టును పరిశీలిస్తామని, అంతవరకు సీబీఐ విచారణపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోమని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆధ్వర్యంలోని ప్రత్యేక విభాగం నిరంతరం విచారణ జరుపుతోందని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు వివరించారు. ఈ అంశంలో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశామని కోర్టుకు తెలిపారు. నిధుల దుర్వినియోగం జరిగినట్లు విచారణలో తేలిందన్నారు. సీసీటీవీ ఫుటేజ్ సహా డిజిటల్ ఆధారాలు కూడా లభించాయని కోర్టుకు తెలిపారు.
దీనిపై స్పందించిన కోర్టు.. ప్రభుత్వం సమర్పించిన నివేదికను పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామన్నారు. ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగాలని సూచించారు. మరోవైపు భక్తులు సమర్పించిన బంగారం, వెండి, నగలు మాయమయ్యాయని, వాటికి సంబంధించిన విరాళాలు, వివరాల్ని ఆన్లైన్లో పొందుపరచాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ఇలా ఆన్లైన్లో వివరాలు బహిరంగ పరచడం వల్ల తప్పుడు విరాళాలు ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉందని, అందువల్ల అది సాధ్యం కాదని కోర్టు తెలిపింది. అయితే, విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాల్ని, రశీదుల్ని జాగ్రత్తగా నిర్వహించాలని సూచించింది.