Shivasena UBT | బీజేపీలో చేరితే గంగా స్నానం చేయొద్దని కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు శివసేన ఉద్ధవ్ ఠాకే వర్గానికి చెందిన ఎంపీ ప్రియాంక ఛతుర్వేది సూచించారు. కాంగ్రెస్ ఎంపీ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఇంకా నగదు లెక్కింపు కొనసాగుతున్నది. నోట్లను లెక్కించేందుకు అదనంగా సిబ్బందితో పాటు యంత్రాలను సైతం అధికారులు పంపారు. ఆదాయపు పన్నుశాఖ నిర్వహించిన దాడిలో పెద్ద మొత్తంలో నగదు బయటపడడంతో రాజకీయ రగడ మొదలైంది. ఐటీ దాడులపై స్పందించేందుకు నిరాకరిస్తున్నది.
ఇది ఎంపీ వ్యక్తిగతమైన విషయమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పార్టీ వర్గాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఉద్ధవ్ వర్గానికి చెందిన ఎంపీ ప్రియాంక ఛతుర్వేది బీజేపీపై విమర్శలు గుప్పించారు. కొంతకాలం తర్వాత ధీరజ్ సాహు బీజేపీలో చేరిత ఇంతకు ముందు కొందరు నేతల్లా క్లీన్చీట్ రాదని ఈ రోజు దేశానికి భరోసా ఇవ్వాలని బీజేపీ మంత్రులు, నేతలకు చెప్పాలనుకుంటున్నానన్నారు. మహారాష్ట్రలో రూ.70వేలకోట్ల కుంభకోణం చూశాం.. బీజేపీలో చేరిన వెంటనే అందరూ దాన్ని మరిచిపోయారన్నారు. ఇదొక్కటే కాదని.. అవినీతికి పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారన్నారు. తమకు, పార్టీకి ద్రోహం చేసి బీజేపీ క్యాంపులో చేరడంతో వారిపై చర్యలన్నీ ఆగిపోయాయన్నారు. కాబట్టి ధీరజ్ సాహు విషయంలో అలా చేయకూడదని.. ఆయన బీజేపీలో చేరిన వెంటనే గంగాస్నానం చేయకూడదన్నారు.
ఐటీ దాడులపై జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా మాట్లాడుతూ.. సాహు పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన వారన్నారు. ఏళ్లుగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారన్నారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే దానిపై ఆదాయపు పన్నుశాఖ స్పష్టత ఇవ్వాలన్నారు. విచారణ తర్వాత అన్ని విషయాలు తేలిపోతాయన్నారు. ఇదిలా ఉండగా.. బౌద్ధ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్లో ఆదాయపు పన్నుశాఖ ఇటీవల దాడులు చేసిన విషయం తెలిసిందే. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని ఎంపీ ధీరజ్ సాహు బంధువులకు చెందిన వివిధ ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ధీరజ్ సాహు కుమారుడు రితేష్ సాహు బౌద్ధ డిస్టిలరీ ఎండీగా, ధీరజ్ సాహు అన్నయ్య ఉదయ్ శంకర్ ప్రసాద్ కంపెనీకి చైర్మన్గా ఉన్నారు. ఈ కంపెనీ ఎక్స్ట్రా న్యాచురల్ ఆల్కహాల్ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని మద్యం తయారీలో వినియోగిస్తుంటారు.