మోదీజీ అచ్చే దిన్ ఆగయే..“అచ్చే దిన్ ఆగయే.. బదాయి హో.. అన్ని భారతీయ కుటుంబాలకు మోదీ జీ బహుమతి’
-గ్యాస్ ధర పెంపుపై మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, సిటీబ్యూరో(నమస్తే తెలంగాణ), న్యూఢిల్లీ, జూలై 6: నిత్యావసరాల ధరలతో కుదేలవుతున్న సామాన్యుడి నెత్తిపై కేంద్రంలోని మోదీ సర్కారు మరో పిడుగు వేసింది. గృహావసరాల కోసం వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్పై రూ. 50 మేర పెంచింది. దీంతో హైదరాబాద్లో సిలిండర్ ధర రూ. 1,055 నుంచి రూ. 1,105కు ఎగబాకింది. బుధవారం నుంచే తాజా ధరలు అమల్లోకి వచ్చినట్టు ఆయిల్ కంపెనీలు తెలిపాయి. సాధారణంగా ప్రతి నెల 1న గ్యాస్ ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. అయితే, 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను సవరించిన కంపెనీలు, 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలో మార్పు చేయలేదు. తాజాగా ధరను పెంచాయి.
14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్పై గడిచిన నాలుగు నెలల్లో నాలుగుసార్లు ధరను పెంచడం గమనార్హం. మార్చి 22న రూ. 50, మే 7న మరో రూ. 50, మే 19న రూ. 3.50 చొప్పున ధరను పెంచారు. తాజాగా మరో రూ. 50 పెంపును కలుపుకొని మార్చి 22 నుంచి ఇప్పటివరకూ రూ. 153.50 పెంచారు. ఇక జూన్ 2021 నుంచి ఇప్పటివరకూ ఎల్పీజీపై ఏకంగా రూ. 244 వడ్డించారు.
గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ ఇస్తున్నామని కేంద్రప్రభుత్వం పేరుకే చెబుతున్నప్పటికీ.. ఒక్కో సిలిండర్పై అది చాలా తక్కువగా రూ.40.79గానే ఉన్నది. ఒకవైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ఇంట్లోంచి వాహనాలను బయటకు తీసే పరిస్థితి లేదు. దానికి తోడు వాటి ధరల ప్రభావం నిత్యావసర సరుకులపైనా పడుతున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్పొరేట్లకు మేలు చేస్తూ సామాన్యులపై ధరల భారాన్ని మోపుతున్నది.
ఎల్పీజీ సిలిండర్ ధర తాజాగా రూ. 50 పెరుగడంపై కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఎన్సీపీ మండిపడింది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సర్కారును కూల్చడానికి ఖర్చు చేసిన మొత్తాన్ని, తాజా పెంపు ద్వారా ప్రజల నుంచి వసూలు చేద్దామని కమలదళం అనుకుంటున్నదా? అని ఎన్సీపీ ప్రతినిధి మహేశ్ తపాసే అన్నారు. ‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు 50.. తాజా పెంపు రూ.50.. ఏమైనా కనెక్షన్ ఉన్నదా?’ అని ఎద్దేవా చేశారు.