Stray Dog | గత కొన్నిరోజులుగా వీధి కుక్కల దాడి ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ నోయిడాలో వీధి కుక్కల దాడిలో పలువురు చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శునకాల దాడిలో చాలా మంది ఆసుపత్రిపాలయ్యారు. ఈ ఘటనలు మరవక ముందే మరో భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వీధి కుక్క రెండు గంటల్లోనే ఏకంగా 40మందిపై దాడి చేసింది.
రాజస్థాన్ రాష్ట్రం బర్మర జిల్లాలోని కల్యాణ్పూర్ ప్రాంతంలో ఓ వీధికుక్క వీరంగం సృష్టించింది. కేవలం 2గంటల వ్యవధిలోనే మొత్తం 40 మందిపై దాడి చేసి గాయపరిచింది. దీంతో వారంతా స్థానిక ఆసుపత్రికి క్యూ కట్టడంతో అక్కడ ఎమర్జెన్సీ వార్డు కుక్క దాడి బాధితులతో కిక్కిరిసిపోయింది. ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
సమాచారం తెలుసుకున్న స్థానిక మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. రెండు బృందాలుగా విడిపోయి దాడి చేసిన కుక్క జాడకోసం వెతకసాగారు. ఇదే సమయంలో నగరంలోని కుక్కల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాటిని పట్టుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.