Earphones | న్యూఢిల్లీ, జూన్ 2: సెల్ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. సెల్ఫోన్ ఉన్న 70 శాతం మంది ఇప్పుడు ఇయర్ఫోన్లు, ఇయర్ బడ్లను సైతం నిత్యం వాడుతున్నారు. ముఖ్యంగా యువత వీటిని విరివిగా వినియోగిస్తున్నది. మ్యూజిక్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోల కోసం ఇయర్ ఫోన్ల వాడకం తప్పనిసరిగా మారింది. అయితే మితిమీరి వీటిని వాడటం వల్ల వినికిడి శక్తి తగ్గడమే కాక చెవుడు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా చెవికి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా యూపీలోని గోరఖ్పూర్కు చెందిన 18 ఏండ్ల ఒక యువకుడు వినికిడి శక్తిని కోల్పోగా ఢిల్లీకి చెందిన డాక్టర్లు అతడికి ఆపరేషన్ చేసి పునరుద్ధరించారు. ఇయర్ ఫోన్లను అధికంగా వాడటం వల్ల చెవిలో ఇన్ఫెక్షన్ ఏర్పడి ఈ పరిస్థితి వచ్చినట్టు ఆపరేషన్ చేసిన డాక్టర్లు వివరించారు. టీనేజర్లలో ‘సౌండ్ మాస్టర్’ కేసులు అధికంగా నమోదవుతున్నట్టు వారు చెప్పారు.
కొంపముంచుతున్న బ్యాక్టీరియా
ఎక్కువ సేపు ఇయర్ ఫోన్లు, బడ్లు వాడకం వల్ల కర్ణములోని నాళంలో తేమ పెరుగుతుంది. క్రమంగా అక్కడ బ్యాక్టీరియా, వైరస్లు అభివృద్ధి చెందుతాయి. బ్యాక్టీరియా వల్ల చెవిటితనం వస్తుంది. చాలా సేపు ఇయర్ ఫోన్లు వాడటం వల్ల చెవిలోకి గాలి, వెలుతురు వెళ్లే మార్గం మూసుకుపోయి చెమట, ఇతర కారణాలతో తేమ పెరిగి ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని డాక్టర్లు వివరించారు.
ఈ జాగ్రత్తలు పాటించండి
ఇయర్ఫోన్ వాడే సందర్భంగా పాటించాల్సిన జాగ్రత్తలపై డాక్టర్లు కొన్ని సూచనలు చేశారు. మీ ఇయర్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో మరొకరికి షేర్ చేయవద్దు. ఎందుకంటే మనం వాడే ఇయర్ ఫోన్ల నుంచి వైరస్ ఇతరులకు సోకుతుంది. లేదా వారి నుంచి మనకు వస్తుంది. మీరు మామూలుగా కానీ, విధి నిర్వహణలో కానీ ఇయర్ ఫోన్లను వాడుతున్నట్టయితే కొద్ది సేపు విరామమివ్వాలి. మీ కార్యాలయ అవసరాలలో వీటి వాడకం తప్పనిసరైతే సాధ్యమైనంత వరకు తక్కువ సౌండ్ పెట్టుకోవాలి. వాడలేనప్పుడు చెవి నుంచి బయటకు తీసి ఉంచాలి. మనం వాడుతున్న బడ్లను తరచూ శుభ్రం చేస్తుండాలి. చెవి నాళాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.