National Medical Commission | వైద్యులందరికీ జనరిక్ మందులను సూచించాలని కేంద్రం ఆదేశించింది. అయితే, వైద్యులు ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానా విధించడంతో పాటు మళ్లీ ప్రాక్టీస్ చేయకుండా లైసెన్సులను సైతం రద్దు చేయాలని జాతీయ మెడికల్ కమిషన్కు సూచించింది. ఈ మేరకు మెడికల్ కమిషన్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్స్ (NMCRMP) పేరిట తాజాగా జారీ చేసిన నిబంధనల్లో పేర్కొంది. వాస్తవానికి వైద్యులు ప్రస్తుతం జనరిక్ మందులను సూచించాలని నిబంధనల్లో ఉన్నది. ఎన్ఎంసీ తాజాగా జరిమానా నిబంధనలు తీసుకురావడం ఇదే తొలిసారి.
అయితే, 2002లో మెడికల్ కమిషన్ జారీ చేసిన నిబంధనల మేరకు ప్రతి వైద్యుడు జనరిక్ మందులనే ప్రిస్క్రైబ్ చేయాలని సూచిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అందులో పేర్కొనలేదు. ఈ క్రమంలో తాజాగా ఆయా నిబంధనల స్థానంలో కొత్తగా నిబంధనలను తీసుకువచ్చింది. ఇకపై ప్రతి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ తన వద్దకు వచ్చే రోగులకు తప్పనిసరిగా జనరిక్ మందులను సూచించాల్సి ఉంటుంది. అనవసరమైన ఔషధాలు, అహేతకమైన ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ మందులను సూచించకూడదని తాజాగా జారీ చేసిన నిబంధనల్లో స్పష్టం చేసింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు వైద్యులను హెచ్చరించడంతో పాటు వర్క్షాప్లకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయనున్నారు. పదేపదే నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సును కొంతకాలం రద్దు చేయడంతో పాటు జరిమానా సైతం విధించే అవకాశం ఉండనున్నది. అలాగే ప్రిస్క్రిప్షన్లు సైతం స్పష్టంగా ఉండాలని, మందుల పేర్లను తప్పనిసరిగా క్యాపిటల్ లెటర్స్లో రాయాలని చెప్పింది. సాధ్యమైనంత వరకు అక్షర దోషాలను నివారించేందుకు ప్రిస్క్రిప్షన్లను టైప్ చేసి ప్రింట్ చేయాలని సూచించింది.
వైద్యులు హేతుబద్ధంగా ప్రిస్క్రిప్షన్లు రాయడానికి ఉపయోగించే ఓ టెంప్లేట్ సైతం ఎన్ఎంసీ అందించింది. జన్ ఔషధి కేంద్రాలు, ఇతర జనరిక్ ఫార్మసీ అవుట్ లెట్ల నుంచి మందులను కొనుగోలు చేసేలా వైద్యులు రోగులను ప్రోత్సహించాలని, వైద్య విద్యార్థులు, ప్రజలకు వాటిపై అవగాహన కల్పించాలని సూచించింది. అయితే, బ్రాండెడ్ ఔషధాల కంటే జనరిక్ మందుల ధరలు 30శాతం నుంచి 80శాతం వరకు చౌకగా ఉంటాయి. ఈ జనరిక్ ఔషధాలను ప్రిస్క్రైబ్ చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణ ఖర్చులు భారీగా తగ్గుతాయి.