తిరువనంతపురం: నెలల శిశివు శరీరం నుంచి అడ్రినల్ ట్యూమర్ను డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. దీని కోసం పోస్టీరియర్ రెట్రోపెరిటోనోస్కోపిక్ విధానాన్ని అవలంభించారు. కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) వైద్యులు ఈ అరుదైన సర్జరీ నిర్వహించారు. (Adrenal Tumour removed From Baby) కొల్లం ప్రాంతానికి చెందిన 11 నెలల పసి పాప ఏడ్పు ఆపకపోవడంతో తల్లిదండ్రులు కిమ్స్కు తీసుకువచ్చారు. పీడియాట్రిక్స్ విభాగానికి చెందిన సీనియర్ డాక్టర్ సనుజా టైటస్ సంతోష్ వైద్య పరీక్షలు నిర్వహించారు. పాప కుడి అడ్రినల్ గ్రంథిపై కణితి ఉన్నట్లు అల్ట్రాసౌండ్ టెస్ట్ ద్వారా నిర్ధారించారు. కుడి మూత్రపిండం పైన ఉన్న పెద్ద రక్తనాళం, కాలేయానికి మధ్య ఆ ట్యూమర్ ఉన్నట్లు సీటీ స్కాన్ ద్వారా గుర్తించారు.
కాగా, పిల్లల డాక్టర్ల బృందం సుమారు రెండున్నర గంటలపాటు శ్రమించి ఆ చిన్నారికి శస్త్రచికిత్స నిర్వహించింది. పసి పాపను మత్తులో ఉంచి బోర్లాపడుకోబెట్టారు. వెనుక భాగంలో చిన్న హోల్ ద్వారా అడ్రినల్ గ్రంథిపై ఉన్న కణితిని తొలగించారు.
మరోవైపు పోస్టీరియర్ రెట్రో పెరిటోనోస్కోపిక్ విధానం ద్వారా ఈ సర్జరీ చేసినట్లు సీనియర్ డాక్టర్ రెజు జోసెఫ్ థామస్ తెలిపారు. ఈ పద్ధతి వల్ల పొట్టలోకి ప్రవేశించకుండా, శరీరంలోని ఇతర అవయవాలకు ఇబ్బంది కలగకుండా మినిమల్ యాక్సెస్ ద్వారా శస్త్రచికిత్స చేయవచ్చని చెప్పారు.
కాగా, ఏకకాలంలో టిష్యూను కత్తిరించడంతోపాటు సీలింగ్ చేసే ప్రత్యేక పరికరం లిగాసూర్ను ఈ సర్జరీకి వినియోగించినట్లు ఇతర డాక్టర్లు వివరించారు. దీంతో శిశువు అదే రోజు సాయంత్రం సాధారణ స్థితికి చేరిందని, ఆహారం తీసుకున్నదని తెలిపారు. మరుసటి రోజున ఆ చిన్నారి లేచి కూర్చోవడంతోపాటు ఆడుకున్నదని వెల్లడించారు.