Coins @ stomach | స్కిజోఫ్రెనియా రోగి కడుపులో నుంచి 187 నాణేలు బయటపడ్డాయి. పేషెంట్ గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా.. వైద్యులు ఎండోస్కోపి చేయగా కడుపులో నాణేలు ఉన్న విషయం తెలిసింది. ఐదుగురు వైద్యులు దాదాపు రెండున్నర గంటల పాటు సర్జరీ చేసి ఆయన కడుపులో నుంచి 187 నాణేలను వెలికితీశారు.
కర్ణాటక రాయచూర్ జిల్లాలోని లింగసుగూర్ పట్టణానికి చెందిన దయ్యప్ప హరిజన్ అనే 58 ఏండ్ల వ్యక్తి గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వాంతులు చేసుకుంటున్న దయ్యప్ప కడుపు బెలూన్ మాదిరిగా ఉబ్బంది. బాగల్కోట్లోని ఓ దవాఖానలో వైద్యులకు చూపగా వారు ఆయనకు ఎక్స్రే, ఎండోస్కోపీ నిర్వహించారు. ఎండోస్కోపీలో కడుపులో నాణేల ఆకారంలో ఉన్న వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆయనకు గ్యాస్ట్రోటమీ శస్త్రచికిత్స చేపట్టి 187 నాణేలను బయటకు తీశారు.
వైద్యుల బృందం దాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించి దయ్యప్ప కడుపులో నుంచి మొత్తం నాణేలను తొలగించింది. ఇందులో ఐదు రూపాయల నాణేలు, రెండు రూపాయల నాణేలు, ఒక్క రూపాయి నాణేలు ఉన్నాయి. ఈ నాణేల మొత్తం విలువ 462 రూపాయలు. వీటి బరువు తూచగా 1.2 కిలోలుగా తేలింది. తమ తండ్రి మానసికంగా ఆరోగ్యంగా లేడని, ఆయన స్కిజోఫ్రెనియా వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన కుమారుడు రవికుమార్ తెలిపాడు. నాణేలు మింగినట్లు ఎవరికీ చెప్పలేదని, మూడు రోజుల క్రితం కడుపునొప్పి రావడంతో దవాఖానకు తీసుకొచ్చినట్లు చెప్పాడు.